హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 11 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 6,500 మందికి పోటీపరీక్షల కోసం కోచింగ్ ఇస్తున్నట్టు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. కోచింగ్ తీసుకొంటున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ కూడా అందిస్తున్నామని చెప్పారు. గ్రూప్-1, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రస్తుతం కోచింగ్ ఇస్తున్నామని, భవిష్యత్తులో మిగిలిన ఉద్యోగాలకు సైతం కోచింగ్ అందిస్తామని వెల్లడించారు. టీ శాట్ నెట్వర్క్ చానళ్లతో అనుసంధానమై సేవలను మరింత విస్తృతం చేస్తున్నామని తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్లోని టీ శాట్ స్టూడియోలో ‘ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో అభ్యర్థులకు సలహాలు- సూచనలు’ అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యకమంలో వెంకటేశం మాట్లాడారు. లక్ష్యాన్ని ఎంచుకొని సరైన పద్ధతిలో ప్రిపరేషన్ ప్రారంభించాలని సూచించారు. గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధతో చదవాలని, ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు వరమని చెప్పారు.
బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
గ్రూప్-1, పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నది. అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ సైదాబాద్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. వివరాలకు 040 – 24071178, 040 27077929 సంప్రదించాలని తెలిపింది.