అందోల్ : రైతుల సంక్షేమం కోసమే సహకార సంఘాలు ఏర్పడ్డాయని , వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికరణ్ అన్నారు. గురువారం జోగిపేట మార్కెట్ యార్డులో సహకార వారోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సహకార సంఘాలు లేకపోతే దేశంలో రైతులు పంటలు సాగుచేసే పరిస్థితి ఉండేది కాదన్నారు.
రైతులు పంటల పెట్టుబడి కోసం ప్రైవేట్ గా అప్పులు చేసి తిప్పలు పడేవారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి రైతు శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేస్తుందని,రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, సాగునీటి వనరుల నిర్మాణాలు తదితర వాటిని విజయవంతంగా అమలు చేస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని అభివర్ణించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వం అందజేస్తున్న మద్దతు ధరను పొందాలని సూచించారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్ మోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, ఎంపీపీ బాలయ్య, పీఏసీఎస్ చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు.