హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసే వారిని నమ్మవద్దని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి (Raghuma Reddy ) జూనియర్ లైన్మెన్ (Junior Linemen) అభ్యర్థులకు సూచించారు. డబ్బులు వసూలు చేసే దళారులను గాని, సంస్థ సిబ్బందిని గాని నమ్మి మోసపోవద్దని తెలిపారు.
సంస్థలో 1553 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష కూడా నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఈ నియామక ప్రక్రియలో చివరి ఘట్టంగా, మెరిట్, రూల్ అఫ్ రిజర్వేషన్స్ ను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన అభ్యర్థులకు ఈ నెల 28 నుంచి వివిధ జిల్లా, సర్కిళ్ల కేంద్రాల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ( Certification Verify), పోల్ క్లైమ్బింగ్ (Pole Climbing) పరీక్షలు నిర్వహిస్తుందని వెల్లడించారు.
ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సంస్థ వెబ్సైట్ (Website)లో ఉంచామని ఆయన తెలిపారు. అర్హతలు ఉండి, పోల్ క్లైమ్బింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి మెరిట్, రూల్ అఫ్ రిజర్వేషన్స్ అనుసరించి అత్యంత పారదర్శకంగా జూనియర్ లైన్మెన్ నియామక ప్రక్రియ జరుగుతుందని వివరించారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.