సంస్థాన్ నారాయణపురం, జూలై 3: చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారడమే గాక.. అసంపూర్తి ఇంటి నిర్మాణంతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులను అన్ని విధాలుగా ఆదుకుంటానని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు భరోసా కల్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నూతనకంటి రాములు, ఉశమ్మ దంపతులు. వీరికి కూతురు రాజేశ్వరి(11), కుమారుడు శివ(9) ఉన్నారు. ఏడేళ్ల క్రితం రాములు క్యాన్సర్తో చనిపోగా ఉశమ్మ ఏడాది క్రితం అనారోగ్యంతో కన్నుమూయడంతో చిన్నారులు ఇద్దరు దిక్కులేనివారయ్యారు. ఇటీవల కురిసిన వర్షానికి ఉన్న కాస్త ఇల్లు కూలిపోయింది. గతంలో దాతలు, స్థానికులు సమకూర్చిన డబ్బులతో గోడల వరకు ఇల్లు కట్టుకున్నారు. పైకప్పు నిర్మాణానికి డబ్బులు లేక అవస్థ పడుతున్నారు. చిన్నారుల దీనగాథపై శనివారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన ‘నిలువ నీడలేదు.. సాయం చేయండి సారూ’ అనే కథనానికి ప్రభాకర్రావు స్పందించారు. ఆ ఇంటి నిర్మాణానికి పూర్తి బాధ్యత తీసుకుంటామని తెలిపారు. సీఎండీ సూచన మేరకు తెలంగాణ విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య గ్రామానికి వెళ్లి సదరు చిన్నారుల యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఇరవై రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తిచేసి, ఆరు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేస్తామని సీఎండీ తరఫున హామీ ఇచ్చారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని అధైర్య పడవద్దని చిన్నారులకు భరోసా కల్పించారు.