CM Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పవర్ ప్లాంట్ల నిర్మాణాలు, ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందం తదితర అంశాలపై జ్యుడీషియల్ విచారణ చేయిస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. విద్యుత్తు రంగం మీద ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొంటూ.. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు తనకు వ్యతిరేకంగా చేస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోవచ్చని అన్నారు.
స్పందించిన రేవంత్రెడ్డి.. ఛత్తీస్గఢ్తో చేసుకున్న 1000 మెగావాట్ల ఒప్పందం వల్ల తెలంగాణపై రూ.1362 కోట్ల భారం పడిందని, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారాలపై జ్యుడీషియల్ విచారణ జరిపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరాపై కూడా అఖిలపక్షంతో నిజనిర్ధారణ కమిటీ వేద్దామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్తు బకాయిలు చెల్లించని ప్రాంతాలలో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని తెలిపారు. ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న హరీశ్రావు, కేసీఆర్, అక్బరుద్దీన్లు బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలని అన్నారు.