హైదరాబాద్: ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంటర్ ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజానాలకు భంగం వాటిల్లకుండా వెంటనే అడ్మిషన్స్ చేపట్టాలని సీఎం సూచించారు. ఇంటర్మీడియట్ ను రద్దు చేసి సీబీఎస్ఈలో మాదిరే 11, 12 తరగతులు నిర్వహించాలని.. ఫలితంగా డ్రాపౌవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
సీబీఎస్ఈతో పాటు మెజారిటీ రాష్ట్రాలు 11, 12 తరగతుల విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉందన్నారు. విలీనంతో ముడిపడిన పలు సాంకేతిక సమస్యలను అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.