హైదరాబాద్: తెలంగాణ ఆర్థికంగా, దృఢంగా అభివృద్ధి చెందాలంటే ఉచితాలు మంచిది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reedy) అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం కొందరు పేదలకు, అర్హులకు అవసరమని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. న్యూజెర్సీలో ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగిచారు. తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్గా లభిస్తుందని చెప్పారు.
గతేడాది తాను టీపీసీసీ అధ్యక్షుని హోదాలో అమెరికాకు వచ్చానని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ ఇక్కడికి వస్తానని చెప్పినట్లు గుర్తుచేశారు. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీతో పాటు, ఇన్పుట్ సబ్సిడీగా రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు వంట గ్యాస్ సిలిండర్, నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు, ఉపాధ్యాయులకు పదోన్నతులు, విద్యార్థులకు నాణ్యమైన విద్య పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తు ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.
తమ పరిపాలనపై ఎలాంటి అపోహలు, ఆందోళనలకు తావు లేదని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించే తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకు వస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిధుల సమీకరణతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పన, నైపుణ్యాల వృద్ధికి అందులో సమానమైన ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఎన్నికల ముందు మాపై ఎంతో విష ప్రచారం జరిగిందని.. గిట్టని వాళ్లందరూ అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారని వెల్లడించారు. ఒకవేళ వచ్చినా అది ఉండనే ఉండదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందంటూ లేనిపోని అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి మాటలు అబద్ధాలని నిరూపిస్తామన్నారు. హైదరాబాద్ను భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతామని చెప్పారు.
నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలతో అమెరికాను పటిష్టంగా, సంపన్నంగా మార్చారని ప్రవాసులను అభినందించారు. ఇకపై తెలంగాణకు సేవలు అందించాలని స్వాగతించారు. తెలంగాణను మెట్రో కోర్ అర్బన్తోపాటు, సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ముఖ్యులతో సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్తో హైదరాబాద్ను అత్యున్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు మీరందరూ కలిసి రావాలని ప్రవాసులకు సీఎం పిలుపునిచ్చారు.