హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. బ్యారేజీల పటిష్ఠత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో లోతుగా, సమగ్రంగా అధ్యయనం చేయించాలని సూచించారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్లాలని, అనవసరపు హడావుడి చేసి మరోసారి తప్పులకు తావివ్వద్దని ఇరిగేషన్ విభాగానికి దిశానిర్దేశం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయంలో శనివారం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతోపాటు, రాష్ట్రంలోని ఇరిగేషన్ ఇంజినీర్లతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ భారీ ప్రాజెక్టు రిపేర్లకు ఎనిమిది నుంచి పది వేల కోట్లు అవసరమయితే ఖర్చుకు ఆలోచించకూడదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎకడా రాజీ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
కృష్ణాజలాల్లో మన వాటా, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతిపక్షాలు చేస్తున్న వాదనల్లో నిజమెంత.. అప్పుడు నిర్ణయాలు తీసుకున్నదెవరు? వాటన్నింటినీ ప్రజల ముందు ఉంచాలని అన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినట్టు వస్తున్న ఆరోపణలపై అధికారులు స్పందిస్తూ.. ఇప్పటివరకు ఏ ప్రాజెక్టును అప్పగించలేదని, ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయలేదని వివరణ ఇచ్చారు.
గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాధాన్యతలవారీగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, మొదటి ప్రాధాన్యతగా తీసుకొని వీలైనంత త్వరగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని, తద్వారా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అధికారులను ఆదేశించారు. తకువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టుల జాబితాను తయారు చేయాలని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సాగునీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా, ఈఎన్సీ మురళీధర్, హరిరామ్, అనిల్కుమార్, నాగేందర్రావు, ఎస్ఈ శ్రీనివాస్ సంబంధిత శాఖ అధికారులు, పలువురు సీఈలు పాల్గొన్నారు.