హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు(Tribute) అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
కాగా, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ తన అసమాన ప్రతిభతో జాతి నిర్మాణంలో కీలక పాతర పోషించారని తెలిపారు.
సామాజిక అసమానతలపై నిరంతరం పోరాడిన గొప్ప యోధుడని, ఆయన చూపిన మార్గంలో మనం పయనించడమే ఆ మహనీయుడికి మనమిచ్చే అసలైన నివాళి అన్నారు. అలాగే సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీచ్, ప్రొ. కోదండరాం తదితరులు బాబాసాహెబ్కు నివాళులు అర్పించారు.