Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్17(నమస్తే తెలంగాణ ): రేవంత్రెడ్డి మాటకారే కానీ పనిమంతుడు కాదని, తెలంగాణ గురించి తెలిసిన ఏకైక నేత కేసీఆర్ ఒక్కరేనని తెలంగాణ ప్రజలు కుండబద్దలు కొట్టారు. జోగులాంబ దేవాలయం అలంపూర్ నియోజకవర్గం నుంచి మొదలుకొని భద్రాద్రి రామయ్య భద్రాచలం నియోజకవర్గం వరకు ప్రజలు ఒకే తీరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలోనే సుఖ సంతోషాలతో ఉన్నామని, రేవంత్రెడ్డి పాలన తమకొద్దని ముక్తకంఠంతో చెప్తున్నారు. రేవంత్ పాలనతో సరిపోల్చినప్పుడు కేసీఆర్ పాలన 100 శాతం అద్భుతమని ప్రజలు తమ మనోగతాన్ని బయటపెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో హెచ్ఎంటీవీ, వోటా, కేకే, చాణక్య స్టాటిస్టిక్స్ తదితర సర్వే సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేశాయి. ప్రజానాడిని పట్టుకునే ప్రయత్నం చేశాయి. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి కూడా చేశారని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీల మీద 82 శాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సర్వేల్లో తేలింది. రానున్న సంస్థాగత ఎన్నికల్లో కేసీఆర్ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేస్తామని మెజారిటీ ఓటర్లు చెప్పుకొచ్చారు.
ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించినదేమిటి? చేయలేకపోయినదేమిటి? ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉన్నది? వంటి పలు అంశాలపై వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రా (వోటా) సంస్థ 2024 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేసింది. సింపుల్ రాండమ్ విధానంలో చేసిన ఈ సర్వే కోసం 1677 శాంపిల్స్ సేకరించినట్టు వోటా సీఈవో కంబాలపల్లి కృష్ట మీడియాకు తెలిపారు. వీరిలో 57% మంది పురుషులు, 43% శాతం మహిళలు ఉన్నారు. పని ఆధారంగా నిరుద్యోగులు, రైతులు, కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులు, కార్మికులు, పెన్షనర్లు, చిరు వ్యాపారుల అభిప్రాయం సైతం సర్వే సంస్థ సేకరించినట్టు చెప్పారు. 18 ఏళ్ల నుంచి 65 ఏండ్లు, ఆ పైన వారి వరకు సర్వేలో పాల్గొన్నారు.
ఇద్దరు సీఎంల పరిపాలనలో ఎవరి పాలన బాగుందన్న ప్రశ్నకు కేసీఆర్ పాలన బాగుందని 44 శాతం మంది ప్రజలు తేల్చి చెప్పారు. రేవంత్రెడ్డి పాలన బాగుందని 30% మంది చెప్పినట్టు సర్వే నివేదించింది. సీఎంగా రేవంత్రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారన్న ప్రశ్నకు ఒక్కరంటే ఒక్కరు కూడా వందకు వంద మార్కులు వేస్తామని చెప్పలేదని, 59 శాతం మంది ఆయనకు 25 మార్కులు వేసి ఫెయిల్ చేసినట్టు వోటా సర్వే పేర్కొన్నది. 200 యూనిట్లలోపు వారందరికీ జీరో కరెంటు బిల్లు అమలు అవుతున్నదా? అన్న ప్రశ్నకు 50 శాతం మంది కొందరికే అమలు అవుతున్నని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? అన్న ప్రశ్నకు బీఆర్ఎస్కు ఓటేస్తామని 39% మంది చెప్పగా, కాంగ్రెస్కే అని 30% మంది, ఎన్డీఏ కూటమికి వేస్తామని 19 శాతం మంది, ఇతరులకు వేస్తామని 7% మంది చెప్పినట్టు సర్వే ఫలితాల్లో వెల్లడించారు.
రేవంత్ ఏడాది పాలన ప్రోగ్రెస్ రిపోర్టు పేరుతో ఒక ప్రముఖ మీడియా హౌస్ తెలంగాణలో పది ఉమ్మడి జిల్లాలో సర్వే చేసింది. ఆయా జిల్లాలోని భౌగోళిక స్వరూపం, రాజకీయ స్వభావం ఆధారంగా చేసుకొని ప్రతి జిల్లా నుంచి రెండు మూడు నియోజకవర్గాలను శాంపిల్గా తీసుకొని సర్వే నిర్వహించారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ, ప్రతిపక్ష, అధికార పక్ష నియోజకవర్గాలు ఉండేలా జాగ్రత్త పడ్డారు. 64,894 మంది నుంచి అభిప్రాయం సేకరించి వాటిని విశ్లేషించి ఫలితాలను ప్రకటించారు. మొత్తం 15 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించగా అన్నింటిలోనూ రేవంత్రెడ్డి పాలన బాగా లేదని మెజార్టీ ప్రజలు తేల్చి చెప్పారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో 57.13 శాతం మంది ప్రజలు ఆయన పాలన బాగా లేదని పెదవి విరిచారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో అత్యధిక మంది ప్రజలు రేవంత్రెడ్డి పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 81.54 శాతం మంది ప్రజలు రేవంత్ పాలన బాగా లేదని తేల్చి చెప్పారు. 64,894 మందిలో కేవలం 23,594 మంది మాత్రమే రేవంత్రెడ్డి ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గద్వాల, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా అసంతృప్తి కనిపించింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో 77.33 శాతం మంది, గద్వాలలో 77.38 శాతం రేవంత్ పాలన అస్సలు బాగా లేదని చెప్పారు.
ప్రభుత్వం, సంక్షేమ పథకాల పట్ల అసంతృప్తి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై చాణక్య స్ట్రాటజీస్ సర్వే నిర్వహించినట్టు ఓ యూట్యూబర్ పేర్కొన్నారు. సర్వే వివరాలను వారు ప్రకటించారు. నాలుగు ప్రధానమైన ప్రశ్నలతో ప్రజల్లోకి వెళ్లి సమాచారం సేకరించినట్టు తెలిపారు. ఈ సర్వే ప్రకారం ప్రభుత్వం పట్ల, సంక్షేమ పథకాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తేలింది. రేవంత్ పాలన ఎలా ఉందని అడిగిన ప్రశ్నకు 55 శాతం మంది ప్రజలు బాగాలేదని స్పష్టం చేసినట్టు సర్వేలో నివేదించారు. సంక్షేమ పథకాల అమలు ఎలా ఉందన్న ప్రశ్నకు 65 శాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు.
హైడ్రా కూల్చివేతల ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా ఉందని, రియల్ ఎస్టేట్ పూర్తిగా స్తంభించిపోవడం, ఈ రంగం మీద ఆధారపడ్డ కొన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దీని ప్రభావం రాబోయే జీహెచ్ఎంసీ ఎ న్నికల్లో పడుతుందని ప్రజలు వెల్లడించినట్టు పేర్కొన్నారు. కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ సంస్థ కూడా కాం గ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన మీద సర్వే నిర్వహించినట్టు ఆ సంస్థ సీఈవో కిరణ్ మీడియాకు చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి సర్వే ఫలితాలను ప్రకటించలేదు. కానీ ఓ మీడియా హౌస్తో మాట్లాడుతూ రేవంత్ పాలనపై డేంజర్ బెల్స్ మోగుతున్నట్టు చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి, గోడ దూకిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గత సర్వే నిర్వహించినట్టు తెలిసింది. నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు గ ద్వాల, భద్రాచలం, స్టేషన్ఘన్పూర్, జగిత్యాల, బాన్సువాడ, చేవెళ్ల, పటాన్చెరు, శేరిలింగంపల్లి, ఖై రతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో రహస్యంగా తిరిగి ప్రజాభిప్రాయం సేకరించినట్టు తెలిసింది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్నెన్ని శాంపి ల్స్ సేకరించారనే వివరాలు తెలియలేదు. అయితే, రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల నుంచి వివరాలను సేకరించినట్టు తెలిసింది.
ఉప ఎన్నిక లు వస్తే ఎవరికి ఓటేస్తారు? అనే ప్రధాన ప్రశ్న ఆ ధారంగా సర్వే జరిగినట్టు తెలిసింది. 10కి పది ని యోజవర్గాల్లో కేసీఆర్కే పట్టం కడతామని ప్రజలు తేల్చి చెప్పినట్టు సర్వే రిపోర్టులను బట్టి తెలిసింది. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ప్రజల పక్షాన అత్యంత సమర్థంగా పనిచేస్తున్నదని, తాజా పరిణామాల నేపథ్యంలో ప్రజలకు కేసీఆర్ మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారని, ఓడిపోయిన తరువాత కేసీఆర్ అత్యంత బలంగా మారారని సర్వే నిర్వాహకులు పాలకులకు నివేదించినట్టు సమాచారం.