Davos WEF | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా బుధవారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకొన్నాయి. అదానీ గ్రూప్సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరుగుతున్న విషయం విదితమే. సీఎం నేతృత్వంలోని బృందం రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సమావేశాల్లో కృషిచేస్తున్నది.
సీఎం రేవంత్తో సీఐఐ ప్రతినిధుల భేటీ
భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం పలు కంపెనీలకు చెందిన సీఈవోలు దావోస్లో సీఎం రేవంత్రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు వారు చేస్తున్న కృషిని అభినందించారు. రాష్ర్టాభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని సీఎంకు భరోసా ఇచ్చారు. సీఐఐ చైర్మన్ శేఖర్రెడ్డితోపాటు వివిధ కంపెనీల సీఈవోలు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.
కంపెనీల పెట్టుబడి ఎంవోయూల వివరాలు
సంస్థ : పెట్టుబడి ఒప్పందం (రూ.కోట్లలో)
అదానీ గ్రూప్ : 12,400
ఆరాజెన్ : 2,000
జేఎస్డబ్ల్యూ ఎనర్జీ : 9,000
గోడి ఇండియా : 8,000
వెబ్ వర్క్స్ : 5,200
గోద్రెజ్ : 1,000
నాడు ఆరోపణలు.. నేడు ఒప్పందాలు
‘ఇద్దరు గుజరాతీలు దేశాన్ని అమ్ముతుంటే..మరో ఇద్దరు గుజరాతీలు కొంటున్నారు, ప్రధాని మోదీ దేశ సంపదను అదానీకి దోచి పెడుతున్నారు’.. ఇవీ ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు. సీఎం రేవంత్రెడ్డి కూడా గతంలో అదానీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి అదానీకి రెడ్ కార్పొరేట్ వేశారు.
దావోస్లో జరుగుతున్న వ్యాపార సదస్సులో అదానీతో భేటీ అయిన సీఎం రేవంత్ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వారిద్దరి భేటీపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ‘అప్పుడేమో మీ అగ్రనేతతో పాటు మీరు అదానీపై ఆరోపణలు చేస్తరు.. ఇప్పుడేమో ఒప్పందాలు చేసుకుంటారా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అదానీపై రాహుల్గాంధీ ఆరోపణలు అపాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరేమో రాజకీయం వేరు.. పరిపాలన వేరు అని సమర్థిస్తున్నారు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రాహుల్గాంధీ అదే అదానీతో ఒప్పందాలు చేసుకుంటారని సెటైర్లు వేస్తున్నారు.