CM Revanth Reddy | హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ముమ్మాటికీ రెఫరండమేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. మ్యానిఫెస్టోలో తాము ఇచ్చిన హామీలను వంద రోజుల్లో నెరవేర్చామని వెల్లడించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనపై సీఎం రేవంత్రెడ్డితో ‘మీట్ ది మీడియా’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజాభీష్టం మేరకు పాలన సాగిస్తున్నామని తెలిపారు. రైతుభరోసా అందరికీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. కొండలు, గుట్టలు ఫామ్హౌస్లకు ఇచ్చేది లేదని ముందే చెప్పామని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం తో, గవర్నర్తో సామరస్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు.
గంజాయి మొక్కలను పీకిపారేస్తాం
బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని గంజాయి మొక్కలను నాటి వెళ్లిందని, ఆ మొక్కలను ఒక్కొక్కటిగా పీకిపారేస్తున్నామని రేవంత్ చెప్పారు. జీరో బిల్లుతో పేదలకు ఉచిత విద్యుత్తు అందిస్తుంటే, కొంతమంది అడ్డు తగులుతున్నారని, వాళ్ల అడ్డు తొలగించైనా పేదలకు ఉచిత విద్యుత్తు అందిస్తామని స్పష్టం చేశారు. ముందుగా డబ్బులు చెల్లించాకే జీరో విద్యుత్తు బిల్లులు ఇవ్వాలని విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. ఇలాంటి తెలివితేటలు ప్రదర్శించిన రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ఎక్కువ రోజులు ఆ కుర్చీలో ఉండరని హెచ్చరించారు. బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్లపై కేంద్రంతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఆఫర్ చేస్తే తీసుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
గేట్లు తెరిచాం.. ఇక ఆగదు
‘వంద రోజుల పాటు సీఎంగా పూర్తి దృష్టి కేంద్రీకరించా.. ఇప్పటి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా నా రాజకీయం ఏమిటో చూపిస్తా. ఈ రోజు ఉదయమే గేట్లు తెరిస్తే అప్పుడే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ మా పార్టీలో చేరారు. ఇక మా గేట్లు తెరిచే ఉంటాయి. మా ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకుంటామా?’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.గత ప్రభుత్వం కొందరు అధికారులతో కలిసి రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. వాటిపై నివేదికలు అందాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహత్అలీ, సీఎం సీపీఆర్వో అయోధ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.