CM Revanth Reddy | మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఇందు కోసం కామన్ పాలసీని తీసుకురావాలని సూచించారు. సచివాలయంలో వైద్యారోగ్యశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడంగల్లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలన్నారు. ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
తద్వారా ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై భారం తగ్గుతుందని చెప్పారు. ఎయిమ్స్ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎయిమ్స్లో పూర్తిస్థాయి వైద్యసేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తారన్నారు. ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో సమస్యలను సీఎంకు అధికారులు వివరించారు. రేపు కోర్టులో బెంచ్పైకి ఉస్మానియా హెరిటేజ్ భవనం ఇష్యూ.. కోర్టు డైరెక్షన్స్ ఆధారంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఏరియాలవారీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్నింటిని గుర్తించి వాటికి సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ నిర్వహణ బాధ్యత పెద్ద ఫార్మా కంపెనీలకు అప్పగించాలని సీఎం చెప్పారు.
నిర్వహణ ఖర్చు వారే భరించేలా చూడాలని.. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఏదో ఒక ఆసుపత్రిలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్కు పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ప్రతీ నెల 15వ తేదీలోగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలని, ప్రతీ మూడు నెలలకోసారి విధిగా ప్రైవేటు ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.