హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గొర్రెలు, చేప పిల్లల పంపిణీ పథకాల అమలుపై విజిలెన్స్ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక, గొర్రెల కొనుగోలు, వాటిని పంపిణీ చేసిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడైనా అవినీతి, అవకతవకలు జరిగినట్టు తేలితే వెంటనే ఆ వివరాలను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు అప్పగించాలని తెలిపారు.
సచివాలయంలో మంగళవారం ఆయన పశు సంవర్ధక, పాడి, మత్స్య అభివృద్ధి శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గొర్రెల పంపిణీ పథకం అమలులో అవకతవకలు జరిగినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవల తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని సీఎం ఈ సమావేశంలో ప్రస్తావించారు. గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను కొందరు ఉద్యోగులు బినామీ పేర్లతో సొంత ఖాతాలకు మళ్లించుకున్నారన్న కేసులో ఏసీబీ దర్యాప్తుపై ఆయన స్పందిస్తూ.. శాఖాపరంగా సేకరించిన వివరాలపై ఆరా తీశారు.
గొర్రెల పంపిణీ పథకానికి తొలి విడతలో రూ.3,955 కోట్ల రుణం ఇచ్చిన నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) రెండో విడత రుణాన్ని ఎందుకు నిలిపివేసిందని రేవంత్ ప్రశ్నించగా.. అప్పటికే కాగ్ ఈ పథకం అమలులో అవకతవకలు జరిగినట్టు గుర్తించి, అభ్యంతరాలను లేవనెత్తిందని, అందుకే రెండో విడత రుణాన్ని ఎన్సీడీసీ ఇవ్వలేదని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే తమ వాటా కింద 25% మొత్తాన్ని డీడీల రూపంలో చెల్లించిన లబ్ధిదారులకు ఎందుకు గొర్రెలను పంపిణీ చేయలేదని సీఎం ప్రశ్నించారు.
రెండో విడతలో 85,488 మంది తమ వాటా కింద 25% డబ్బు చెల్లించారని, వారు చెల్లించిన దాదాపు రూ.430 కోట్లు జిల్లా కలెక్టర్ల ఖాతాల్లోనే ఉన్నాయని, మరో 2,20,792 మంది లబ్ధిదారులు ఇంకా డబ్బులు కట్టలేదని అధికారులు చెప్పారు. దీంతో ఈ పథకం అమలు తీరుపై పలు అనుమానాలున్నాయని సీఎం పేర్కొంటూ.. సమగ్ర విచారణకు ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్రంలోని ప్రతి మండలంలో తప్పకుండా ఓ పశు వైద్యశాల ఉండేలా చూడాలని, 91 కొత్త మండలాల్లోనూ వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కొనసాగించాలని, అందుకు అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని అన్నారు. వివిధ పథకాల కింద కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువైద్య విభాగంలో ఏండ్ల తరబడి పనిచేస్తున్నవారికి టీఎస్పీఎస్సీ చేపట్టిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలన్న ప్రతిపాదనను పరిశీలించాలని, వైద్యారోగ్య శాఖలో అమలైన వెయిటేజీ విధానాన్ని ఈ విభాగంలోనూ అమలు చేసేలా చూడాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పశు సంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ అధర్ సిన్హా, పాడి పరిశ్రమ శాఖ డెయిరీ డైరెక్టర్ లక్ష్మి, మత్స్య పరిశ్రమ శాఖ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.
లీటర్ పాలకు రూ.4 చొప్పున పాడి రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని మూడేండ్లుగా ఇవ్వకపోవడంతో దాదాపు రూ.203 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని అధికారులు ఈ సమావేశంలో వివరించారు. చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. పాడి రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాన్ని ఏప్రిల్ నుంచి క్రమం తప్పకుండా విడుదల చేయాలని, ప్రతి నెలా గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.