హైదరాబాద్, జనవరి 6(నమస్తే తెలంగాణ): తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి ప్రాంతాన్ని అర్బన్ క్లస్టర్గా, ఆ తర్వాత రీజినల్ రింగ్రోడ్డు వరకు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్గా, రీజనల్ రింగ్రోడ్డు తర్వాత చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్గా విభజిస్తామని తెలిపారు. పారిశ్రామికంగా అన్ని రంగాలు అభివృద్ది చెందేలా ఫ్రెండ్లీ పాలసీని అమలు చేసేందుకు ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. శనివారం సచివాలయంలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని పేర్కొన్నారు. వచ్చే పాతికేళ్లనాటికి నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామికవృద్ధి జరగాలనే భవిష్యత్తు లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్-2050కి రూపకల్పన చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒకలా ఉంటే, 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇది అత్యున్నత వృద్ధి దశకు చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. తెలంగాణలోని అన్ని ప్రాంతా లు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.
ఫార్మాసిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని రేవంత్ తెలిపారు. ఫార్మాసిటీగా కాకుండా ఫార్మా విలేజీలను అభివృద్ధి చేస్తామని వివరించారు. ఓఆర్ఆర్పై 14 రేడియల్ రోడ్లు ఉన్నాయని, వీటికి 12 జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉందని, వీటికి అందుబాటులో ఉండేలా దాదాపు వెయ్యి నుంచి 3 వేల ఎకరాలకో ఫార్మా విలేజీని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
జహీరాబాద్లో ఐటీ, ఫార్మా, హెల్త్తోపాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, ఆర్గానిక్ క్లస్టర్లుగా అకడ పరిశ్రమల ఏర్పాటు జరగాలని సీఎం ఆకాక్షించారు. రక్షణరంగం, నావికారంగానికి అవసరమైన పరికరాల తయారీ, ఉత్పత్తికి హైదరాబాద్లో అపారమైన అవకాశాలున్నాయని, పారిశ్రామికవేత్తలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. కొత్తగా సోలార్ పవర్ పాలసీ రూపొందిస్తామని, సోలార్ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న దాదాపు 35 లక్షలమంది నిరుద్యోగులను భారంగా భావించడం లేదని, వారిని పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా భావిస్తున్నట్టు సీఎం చెప్పారు. యువత నైపుణ్యం సాధించేలా స్కిల్ యూనివర్సిటీలు నెలకొల్పుతామని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్రెడ్డి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు సీ శేఖర్రెడ్డి, అనిల్కుమార్, డాక్టర్ మోహన్రెడ్డి, సతీశ్రెడ్డి, సుచిత్రా కె ఎల్లా, వనిత దాట్ల, రాజు, సంజయ్సింగ్, ప్రదీప్ ధోబాలే, శక్తిసాగర్, వై హరీశ్చంద్రప్రసాద్, గౌతమ్రెడ్డి, వంశీకృష్ణ గడ్డం, శివప్రసాద్రెడ్డి రాచమల్లు, రామ్, చక్రవర్తి, షేక్ షమీవుద్దీన్, వెంకటగిరి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
నగరం నాలుగువైపులా జనావాసాలకు దూరంగా నాలుగు డంప్యార్డ్లు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్ మొత్తానికి జవహర్నగర్లో ఒకే ఒక్క డంప్యార్డ్ ఉంది. మెట్రోరైల్ రూట్ విస్తరణపై సీఎం మాట్లాడుతూ గతంలో సర్వేచేసిన గౌలిగూడ-ఫలక్నుమా-విమానాశ్రయం, ఎల్బీనగర్ నుంచి ఎయిర్పోర్టు రూట్ను ప్రజలు ఎకువగా వినియోగించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మూసీనది పరీవాహక ప్రాంతాల్లోని చార్మినార్, గోల్కొండ, సెవెన్టూంబ్స్, తారామతి బారాదరి వంటివాటిని అనుసంధానిస్తూ టూరిజం సర్క్యూట్ రూపొందించాలని కోరారు. ఈ ప్రాంతంలో పీపీపీ మోడల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్టు సీఎం తెలిపారు. .