హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల్లో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గప్రజలను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేస్తున్నదని ముదిరాజ్ ఐక్యవేదిక వ్యవస్థాపకులు, రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ధ్వజమెత్తారు. ముదిరాజ్ల ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గానికి తొలుత నీలం మధును తమ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. చివరి నిమిషంలో ఆ టికెట్ను మరొకరికి కేటాయించడం ద్వారా ముదిరాజ్లను తీవ్రంగా అవమానించిందని నిప్పులు చెరిగారు. ముదిరాజ్లకు కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లుగా తీరని అన్యాయం చేస్తున్నదని, 1970లో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ముదిరాజ్లను బీసీ-ఏలో కాకుండా బీసీ-డీ క్యాటగిరీలో చేర్చి రిజర్వేషన్లకు గండి కొట్టిందని వివరించారు. ఆ తర్వాత రిజర్వేషన్లలో ముదిరాజ్లకు న్యాయం చేస్తామంటూ 2009లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం జీవో 15ను జారీచేసినప్పటికీ అది అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముదిరాజ్లకు అండగా బీఆర్ఎస్
ముదిరాజ్లకు బీఆర్ఎస్ అండగా నిలిచిందని, రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషిచేన్నారని పిట్టల రవీందర్ స్పష్టం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ముదిరాజ్లు పోటీచేసేందుకు బీఆర్ఎస్ అవకాశం ఇవ్వకపోయినప్పటికీ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్, యువనాయకుడు కాసాని వీరేశ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మంద నగేశ్, అంబర్పేట కార్పొరేటర్ శంకర్, ప్రజా కళాకారుడు బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ తదితరులు బీఆర్ఎస్లో చేరారని ఆయన వివరించారు.