Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగా ణ): ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పా టు చేయాలన్న సీఎం కేసీఆర్ కల తుది దశకు చేరింది. ఈ ఏడాదితో రాష్ట్రంలో 75 శాతం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. తెలంగాణ ఏర్పడిన నాడు కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 26కు పెరుగనున్నది. ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుండగా.. ఇప్పటికే కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, వికారాబాద్ మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల కాలేజీల అనుమతులు తుది దశలో ఉన్నాయి. దీంతో కాలేజీల సంఖ్య పెరిగి రాష్ట్రంలో మూడొంతుల జిల్లాల్లో ప్రజలకు స్పెషాలిటీ సేవలు అందనున్నాయి. వచ్చే ఏడాది మరో 7 కాలేజీలు ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటవుతుంది. ఇదే సమయంలో జాతీయ సగటును పరిశీలిస్తే.. 50 శాతం జిల్లాల్లో మాత్రమే మెడికల్ కాలేజీలు ఉన్నాయి.
తెలంగాణ ఏర్పడేనాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. తర్వాత ప్రభుత్వం మొదటి దశలో 4, రెండో దశలో 8 కాలేజీలు నెలకొల్పింది. ఈ ఏడాది మరో 9 కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో కాలేజీల సంఖ్య 26కు చేరనున్నది. అంటే పదేండ్లలోనే 5 రెట్లకుపైగా కాలేజీలు పెంచి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారు.
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నది. కానీ, తెలంగాణకు ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను వివక్షతో పక్కనబెట్టింది. అయినా సీఎం కేసీఆర్ వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు కేంద్రం ఆ 157 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా.. నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నది. దీంతో తెలంగాణకు కనీసం నర్సింగ్ కాలేజీ కూడా దక్కలేదు. అయినా రాష్ట్రంలో సొంతంగా ఏర్పాటు చేస్తున్న ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మెడికల్ కాలేజీలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు, అత్యాధునిక పరికరా లుంటాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు, సీనియర్ రెసిడెం ట్లు.. ఇలా భారీగా సిబ్బంది ఉంటారు. దీంతో ప్రజలకు మంచి వైద్యం అందుతుంది. పెద్ద వ్యాధి వచ్చినా హైదరాబాద్ వరకు పరుగెత్తాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రంలోనే చి కిత్స పొందవచ్చు. జిల్లాల వికేంద్రీకరణ నేపథ్యంలో మారుమూల గ్రామాలకూ జిల్లా కేం ద్రాలు గరిష్ఠంగా 50-70 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. అత్యవసర సమయాల్లో వేగంగా పెద్ద దవాఖానకు చేరుకోవచ్చు.
ఎంబీబీఎస్ సీట్లు 2014లో 850 ఉండగా ఈ ఏడాదికి 3,600కు పైగా రానున్నాయి. పదేండ్లలో నాలుగున్న రెట్లు పెరిగాయి. పీజీ సీట్లు ఇప్పటికే డబుల్ అయ్యాయి. సూపర్ స్పెషాలిటీ సీట్లు సైతం 76 ఉండగా 2022-23 నాటికి రెట్టింపై 152కు చేరుకున్నాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు స్థానికంగా చదువుకొనే అవకాశాలు పెరిగాయి. డబ్బు ఖర్చు చేసుకొని విదేశాలకు వెళ్లే అవస్థ తప్పుతుంది. ఉక్రెయిన్ వంటి విపత్తుల సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగి రావడం, చదువును కొనసాగించడానికి నానా కష్టాలు పడాల్సిన దుస్థితి పోతుంది. హాయిగా సొంత రాష్ట్రంలోనే ఉంటూ ఉచితంగా తమ కలలను నెరవేర్చుకోవచ్చు.
మెడికల్ కాలేజీ అంటే కేవలం విద్యా సంస్థ మాత్రమే కాదు. అనుబంధంగా అనేక వసతులు ఏర్పడుతాయి. ఆ ప్రాంతం ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతుంది. కాలేజీకి అనుబంధంగా దవాఖాన అందుబాటులోకి వస్తుంది. వీటిల్లో పనిచేయడానికి భారీగా సిబ్బంది అవసరం ఉంటారు. దీంతో స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పెరుగుతుంది. విద్యార్థులు, డాక్టర్లు, సిబ్బంది, దవాఖానకు వచ్చే రోగులు, సహాయకులు.. వారి కోసం రవాణా, వసతి సదుపాయాలు.. ఇలా ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి అభివృద్ధి చెందుతుంది.