జగిత్యాల మే 10: దళిత బంధు పథకాన్ని వినియోగించుకుంటూ దళితులు ఆర్థికంగా ఎదగాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాలోని గొల్లపల్లి మండలంలో 100 మంది దళిత బంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని రూపొందించారని మంత్రి అన్నారు.
గతంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలలో 60% ఉందని, బ్యాంకు లింకేజీ రుణాలు లభించక అనేక ఇబ్బందులు ఉండేవని మంత్రి గుర్తుచేశారు. దళిత బంధు పథకం విజయం సాధించడం లబ్ధిదారుల చేతుల్లో ఉందని, సీఎం కేసీఆర్ మనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి కోరారు. దళిత బంధు లబ్ధిదారులుగా ఎంపిక చేసుకున్న యూనిట్లలో కష్టపడి పనిచేసే వ్యాపారాన్ని వృద్ధి లోకి తీసుకొని రావాలని, నిధులను సమర్థవంతంగా మార్కెట్ డిమాండ్ ప్రకారం వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.
దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా 3 వేల రూపాయల పెన్షన్ అందజేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దివ్యాంగుల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి వారికి అవసరమైన పరికరాలు బ్యాటరీ ట్రై సైకిల్ పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 250 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు.
నాణ్యమైన పరికరాల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో వాటి పంపిణీని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత, కలెక్టర్ రవి, ఎస్సీ కార్పొరేషన్ఈడీ లక్ష్మీ నారాయణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.