రాఫెల్ ఒప్పందంలో దసాల్ట్ ఏవియేషన్ చెల్లింపు
ఫ్రెంచ్ మీడియా వెల్లడి
దర్యాప్తు జరిపించాలి: కాంగ్రెస్
నిరాధార ఆరోపణలు: బీజేపీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మళ్లీ దుమారం రేగింది. ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ తయారీ సంస్థ ‘దసాల్ట్ ఏవియేషన్’ భారత్కు చెందిన ఓ ‘మధ్యవర్తి’కి రూ.9.51 కోట్లు (1.1 మిలియన్ యూరోలు) చెల్లించినట్టు ఫ్రెంచ్ ప్రచురణ సంస్థ ‘మీడియాపార్ట్’ కథనం ప్రచురించడం కలకలం రేపింది. ఆ దేశ అవినీతి నిరోధక సంస్థ (ఏఎఫ్ఏ) ఆడిటింగ్లో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపింది. భారత్లో మరో రక్షణ ఒప్పందంలో మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే ఆ మధ్యవర్తి అని వెల్లడించింది. 50 రాఫెల్ నమూనా విమానాల తయారీకే ఆ మొత్తాన్ని వినియోగించినట్టు దసాల్ట్ పేర్కొన్నదని, అయితే అందుకు ఆధారాలు మాత్రం చూపలేదని తెలిపింది. ‘క్లయింట్లకు బహుమతుల’ కింద ఈ మొత్తాన్ని చూపినట్టు వెల్లడించింది. భారత్కు చెందిన డెఫ్సిస్ సొల్యూషన్స్ కంపెనీకి ఈ మొత్తాన్ని చెల్లించినట్టు ఏఎఫ్ఏ తన నివేదికలో తెలిపింది. డెఫ్సిస్ సొల్యూషన్స్ కంపెనీ సుషేన్ గుప్తాకు చెందినది. అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో అతడు నిందితుడు. దసాల్ట్ ఏవియేషన్కు డెఫిసిస్ కంపెనీ సబ్కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్నది.
పూర్తిగా అవాస్తవం: బీజేపీ
రాఫెల్ ఒప్పందంపై అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని బీజేపీ కొట్టివేసింది. ఒప్పందంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇదివరకే నిరాకరించిందని, అలాగే ఎలాంటి అక్రమాలు జరుగలేదని కాగ్ కూడా పేర్కొన్నదని గుర్తుచేసింది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఓటమిపాలైందని ఎద్దేవా చేశారు. ఫ్రెంచ్ మీడియా కథనం పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. ఆ దేశంలో ‘కార్పొరేట్ వైరం’ కారణంగానే ఈ ఆరోపణలు చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సాయుధ దళాలను బలహీనం చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తున్నదని మండిపడ్డారు. బాలాకోట్ దాడుల సమయంలోనే రాఫెల్ వాయుసేనకు అంది ఉండే, దాడులు చేసేందుకు సరిహద్దు దాటాల్సిన పని ఉండేది కాదన్నారు.
ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి: కాంగ్రెస్
రాఫెల్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించడంతోపాటు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ.. రాఫెల్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని తాము ముందు నుంచీ చేస్తున్న ఆరోపణలు నిజమేనని ఫ్రెంచ్ మీడియా కథనం రుజువు చేసిందని పేర్కొన్నారు. దసాల్ట్ కంపెనీ ఆ కమీషన్ను ‘వినియోగదారులకు బహుమతి’గా పేర్కొనడం విడ్డూరమన్నారు. అయితే రక్షణ ఒప్పందంలో ఎలాంటి మధ్యవర్తిగానీ, కమీషన్గానీ ఉండకూడదని నిబంధనలు స్పష్టంచేస్తున్నాయన్నారు.
మరిన్ని వార్తలు చదవండి..
ఒంటికాలితో బెంగాల్ను.. రెండుకాళ్లతో ఢిల్లీని గెలుస్తా
శత్రు క్షిపణులను దారి మళ్లించే చాఫ్
గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా కన్నుమూత
భూ కుంభకోణంలో యెడియూరప్పకు ఊరట