CM KCR | ఉపాధ్యాయుల దినోత్సవం ( సెప్టెంబర్ 5) సందర్భంగా టీచర్లందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానాన్ని పెంపొందించి.. లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహనను కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదనీ సీఎం అన్నారు. మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ అనే సూక్తి తల్లిదండ్రుల తర్వాత గురువుకు ఉన్న ప్రాధాన్యతను తెలియచేస్తున్నదని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు.. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి, అభివృద్ధికి సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. గురుకుల విద్యలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తూ రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో ముందంజలో ఉందన్నారు. గుణాత్మక విద్యను అందిస్తూ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు చదువుల్లోనూ, క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని చాటుతున్నారని గుర్తు చేశారు. విద్యారంగ ప్రగతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అంకితభావానికి, చిత్తశుద్ధికి ఇది నిదర్శమని పేర్కొన్నారు.