Secretariat | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనామందిరాలను శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. తుది మెరుగులు దిద్దే పనులు గురువారం సాయంత్రానికి పూర్తిచేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. అనంతరం నల్లపోచమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె వెంట ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాస్రాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి టీఎస్ శ్రీదేవి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు తదితరులు ఉన్నారు. అటు.. సెక్రటేరియట్లోని మసీదును రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం గురువారం సందర్శించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
నేడు ప్రాణప్రతిష్ఠ
సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా సెక్రటేరియట్లో ఆలయం, మసీదు, చర్చిని నిర్మించగా, ఆలయ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలను బుధవారమే మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. గురువారం స్థాపిత పూజ, ప్రతిష్ఠాపన హోమం, మహాస్నపనం(తిరుమంజనం), వేద పారాయణం, మహాలక్ష్మీ యాగము, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం చండీయాగం, ప్రాణప్రతిష్ఠాపన హోమం, ధ్వజస్తంభ, యంత్ర, విగ్రహాల ప్రతిష్ఠ, వేదోక్తంగా ప్రాణప్రతిష్ఠ, మూడు ఆలయాల శిఖర కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం తదితర కార్యక్రమాలు ఉంటాయి. నల్లపోచమ్మ, శివుడు, ఆంజనేయస్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి తదితర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు.