యాదాద్రి భువనగిరి : మహిళల పక్షపాతిగా సీఎం కేసీఆర్ను మహిళలంతా గుర్తుంచుకుంటారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్లోని ఎస్ ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలను సన్మానించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలకు సీఎం శ్రీకారం చుట్టారని తెలిపారు. అన్ని వర్గాల్లోని పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకే కల్యాణ లక్ష్మికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందారని స్పష్టం చేశారు.
సమావేశంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ,మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ,మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.