హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): సురవరం ప్రతాపరెడ్డి రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారునిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సామాజిక సేవ చేసిన తెలంగాణ వైతాళికుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నివాళి అర్పించారు. శుక్రవారం సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
తెలంగాణపై వివక్షను ఆనాడే ఎదిరించి గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణ సాహితీ ఆత్మగౌరవాన్ని చాటిన సురవరం, తెలంగాణ గడ్డ గర్వించదగ్గ బిడ్డ అని కొనియాడారు. తెలంగాణ సాధనా పోరాటంలో సురవరం స్పూర్తి ఇమిడి ఉన్నదని అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవాలను ఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. సురవరం సేవలకు గుర్తుగా ఆయన పేరుతో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు గౌరవ పురసారాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.