కమలాపూర్/కమలాపూర్ రూరల్, అక్టోబర్ 6: అనామకుడిగా ఉన్న ఈటల రాజేందర్ను ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా, మంత్రిగా పదవులు ఇచ్చి, పెద్దోన్ని చేసిన కేసీఆర్కే వెన్నుపోటు పొడిచేందుకు ఈటల కుట్రపన్నారని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ మండిపడ్డారు. బుధవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం గునిపర్తి, శ్రీరాములపల్లి, అంబాల గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. 2004లో వ్యాపారం చేస్తూ అనామకుడిగా ఉన్న ఈటలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కమలాపూర్కు తెచ్చి, ఎమ్మెల్యేగా చేశారని చెప్పారు. అనంతరం అనేక పదవులు అనుభవించిన ఈటల, అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని సీఎం కావడానికి కుట్రలు చేశారని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికి బీజేపీలో చేరారని ఆరోపించారు. సంక్షేమంలో తెలంగాణ ముందంజలో నిలుస్తున్నదని, సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచాయని పేర్కొన్నారు. గులాబీకి వెన్నుపోటు పొడిచిన ఎందరో నాయకులు కాలగర్భంలో కలిసిపోయారని, రానున్న రోజుల్లో ఈటల కూడా కనుమరుగు కావ డం ఖాయమని చెప్పారు. గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే, చేతకాక ఈటల రాజేందర్ రాజీనామా చేశారని ఆగ్ర హం వ్యక్తంచేశారు.
ధరలు పెంచే పార్టీని తరిమికొట్టాలి
నిత్యం వంట గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీని తరిమికొట్టాలి. ఆ పార్టీ వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్ప ఒరిగేది ఏమీలేదు. రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్ఎస్ సర్కారుకు ప్రజలంతా అండగా ఉండాలి. దేశంలో ఎక్కడాలేని విధంగా పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్. పనిచేసే ప్రభుత్వానికే ఓటేయ్యాలి. గులాబీ పార్టీ కార్యకర్తలు అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి. గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి.
బీజేపీ ఏంచేస్తదో రాజేందర్ చెప్తలేరు
మాసాయిపేట భూకబ్జాలో ప్రభుత్వ విచారణలో ఈటల రాజేందర్ బాగోతం బయటపడుతుం దని, ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రజలకు పరిచయం లేని వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయం గా పెంచి పెద్ద చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్కే వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తదో ఎక్కడా చెప్పడం లేదు. ఈటల కేవలం డబ్బులను, మద్యంనే నమ్ముకున్నారు.