రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్
యాదాద్రి, ఫిబ్రవరి 4: సీఎం కేసీఆర్ మది లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి తెలంగాణ టూరిజం డెస్టినేషన్ ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం కుటుంబ సభ్యులతోపాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డితో కలిసి స్వామివారి నిజాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదాద్రి నూతనాలయాన్ని తిలకించారు. సీఎం కేసీఆర్ మదిలో బృహత్తర టూరిజం డెస్టినేషన్ ఉన్నదని తెలిపారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి యాదాద్రి దివ్యక్షేత్రాన్ని దర్శించుకొని.. ఆ తర్వాత కొలనుపాకలోని ప్రసిద్ధ జైన దేవాలయం, హనుమకొండలోని వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ ఫోర్ట్, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, లక్నవరం చెరువు సందర్శన కోసం టూరిజం టూర్ కాకతీయ సర్క్యూ ట్ ప్యాకేజీ పరిశీలనలో ఉన్నదన్నారు. జాతీయ, అంతర్జాతీయ టూరిస్టులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించనున్నట్టు చెప్పారు. సమైక్య పాలనలో రాష్ట్రంలోని దేవాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. స్వరాష్ట్రంలోనే దేవాలయాలకు మహర్దశ కలుగుతున్నదని తెలిపారు. రాజరిక వ్యవస్థలో కాకతీయులు, చోళ, పాండ్య, శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతిని పెంపొందించారని, ప్రజాస్వామ్య దేశంలో అలాంటి పాత్రను పోషిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని వినోద్కుమార్ కొనియాడారు. యాదాద్రిలో అద్భుతమైన కట్టడాలు ప్రతిఒక్కరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తాయని తెలిపారు. రానున్న రోజుల్లో వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని కూడా అద్భుతంగా నిర్మించనున్నట్టు చెప్పారు. గోదావరి నది జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉద్యమకాలంలో ఇచ్చిన హామీ ప్రకారం నృసింహస్వామి జలాశయం, గంధమల్ల జలాశయాలను నిర్మించారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్, ధర్మేందర్రెడ్డి పాల్గొన్నారు.