హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్పై మంగళవారం ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు నేతృత్వంలో విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులు విద్యుత్సౌధలో సమావేశమయ్యారు. వేసవి కాలం దృష్ట్యా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును ఏవిధంగా సరఫరా చేయాలనే అంశంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర్రావు మాట్లాడుతూ.. గత సంవత్సరం కంటే ఈ ఏడు 30 శాతం విద్యుత్తు వినియోగం అదనంగా పెరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిరంతర విద్యుత్తు సరఫరాకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. వ్యవసాయ రంగానికి దాదాపు 30 శాతం విద్యుత్తు వినియోగం అవుతుండగా పరిశ్రమలకు కూడా 20 శాతం వరకు వినియోగం పెరిగిందని సీఎండీ వివరించారు. రానున్న రోజుల్లో 16 వేల మెగావాట్ల గరిష్ఠ డిమాండ్, 300 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదయ్యే అవకాశాలున్నాయని ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర్రావు పేర్కొన్నారు.
ఎన్టీపీసీ నుంచి ఆలస్యం
వాస్తవానికి ఎన్టీపీసీ నుంచి సంవత్సరం క్రితమే విద్యుత్తు సరఫరా కావాలి.. కానీ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదని సీఎండీ ప్రభాకర్రావు తెలిపారు. గతేడాది నవంబర్ నెలలోనే రామగుండంలోని ఎన్టీపీసీలో ఒక యూనిట్ ప్రారంభించాల్సి ఉన్నదని, కానీ ఇప్పటి వరకు అది అందుబాటులోకి రాలేదని సీఎండీ విచారం వెలిబుచ్చారు. ఆ విద్యుత్తు అందుబాటులోకి రాకపోవటంతో కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చిందని, అయినప్పటికీ ఎక్సేంజీలో విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది డిస్కంలకు భారమైనప్పటికీ, వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే సుమారు రూ.1000 కోట్లు ఖర్చు అయ్యాయని, రానున్న రోజుల్లో రూ.1500 కోట్ల వరకు అవసరం పడుతుందని అంచనా వేశారు.
గరిష్ఠ డిమాండ్, వినియోగం నమోదు
రాష్ట్రంలో మంగళవారం గరిష్ఠ విద్యుత్తు డిమాం డ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంటా ఒక నిమిషానికి రాష్ట్రంలో గరిష్ఠ డిమాండ్ 14,794 మెగావాట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే తారీఖున 12,966 మెగావాట్లు నమోదు కాగా, ఒక సంవత్సర కాలంలోనే దాదాపు 1,828 మెగావాట్ల అదనపు డిమాండ్ నమోదవ్వడం గమనార్హం. అలాగే విద్యుత్తు వినియోగం విషయంలోనూ ఆల్టైం రికార్డు నమోదయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం ఒక్కనాడే (24 గంటల్లో) 290.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది.
ఏకైక రాష్ట్రం తెలంగాణే..
వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని సీఎం ఆదేశించినట్టు సీఎండీ తెలిపారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నామని, నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తామని చెప్పారు. నాణ్యమైన విద్యుత్తును 24 గంటలపాటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎండీ ప్రభాకర్రావు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు, జేఎండీ శ్రీనివాసరావు, ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పెరగనున్న వినియోగం
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఫ్యాన్లు, ఏసీలు తదితర గృహ, వాణిజ్యపరమైన విద్యుత్తు వినియోగం పెరిగింది. అలాగే యాసంగికి సంబంధించి వరి పంట పొట్ట దశలో ఉండటంతో గరిష్ఠంగా విద్యుత్తు వినియోగం జరుగుతున్నది. మార్చి నెలలో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో.. అందుకు తగిన ఏర్పాట్లలో ఉన్నతాధికారులు ఉన్నారు.