ఎలాంటి కష్టమొచ్చినా మేమున్నామనే భరోసా బాధితులకు కొండంత అండగా నిలుస్తుంది. భవిష్యత్తుపై ఆశతో సులభంగా కష్టాల కడలిని దాటేస్తారు. కరోనా రోగులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అలాగే అండగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ చూపిన మార్గంలో పయనిస్తూ బాధితులకు తోడునీడులా మారారు. దీంతో రోగులు కొలుకొని క్షేమంగా ఇంటికి వెళ్తున్నారు.
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): కరోనాతో అల్లాడుతున్న రోగులకు ప్రజాప్రతినిధులు ఆత్మీయ స్పర్శ అవుతున్నా రు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 19న సికింద్రాబాద్ గాంధీ, 21న వరంగల్ ఎంజీఎం దవాఖానలను పరిశీలించి బాధితులకు అందుతున్న వైద్యసేవలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. బాధితులకు, వారి కుటుం బసభ్యులకు ధైర్యం చెప్పారు. సీఎం ఇచ్చిన ధైర్యంతో ఎంతోమంది రోగులు కోలుకొని ఇండ్లకుచేరారు. ‘మంత్రులు ఎక్కడిక్కడ దవాఖానలను సందర్శించి అవసరమైన ఏర్పాట్లుచేయాలి. బాధితులకు అండగా ప్రభుత్వం నిలబడిందన్న భరోసా కల్పించి వారిలో మనోధైర్యాన్ని నింపాలి. అందుబాటులోని అన్ని వనరులను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలి. మంత్రులు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి’ అని సీఎం కేసీఆర్ దేశించారు. దీం తో ఆ రోజు నుంచే మంత్రులు జిల్లా కేంద్రాలకు తరలివెళ్లారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వారివారి జిల్లాల్లోని కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు. దవాఖానల్లో సౌకర్యాల కల్పనకు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి నివేదిస్తున్నారు.
సమన్వయ సారథ్యం
ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వనరులేమిటి? ప్రభుత్వం తక్షణం నెరవేర్చాల్సిన ప్రాధాన్యాలేమిటి? అనే అంశాలపై కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, ఆయా దవాఖానల సూపరింటెండెంట్లతో మంత్రులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ సేవల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న వైద్యారోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ, పోలీసు, రెవెన్యూశాఖల ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు. శాఖల మధ్య సమన్వయాన్ని నెలకొల్పుతూ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డయాగ్నస్టిక్ సెంటర్లకు ఎమ్మెల్యేలు వెళ్లి ప్రభుత్వ నిర్ణయించిన ధరల కన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నవారిని మందలిస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేయకుండాకట్టడి చేస్తున్నారు. ఏ ఆసరాలేని కరోనా రోగులను హోంఐసొలేషన్లో ఉంచి మెరుగైన వైద్యం, పౌష్టికాహారం అందించడంలో ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. హోంక్వారంటైన్లో ఉన్నవారికి, రోజు కూలీలకు నిత్యావసరాలను సరఫరా చేస్తున్నారు.
పీపీఈ కిట్లతో కరోనా వార్డులకు..
‘మీ వెంట ప్రభుత్వం ఉన్నది. మీరు త్వరగా కోలుకుంటారు’ అనే ధైర్యాన్ని కరోనా బాధితులకు ఇవ్వటం కోసం, వారి బంధువుల్లోనూ భరోసా నింపేందుకు మంత్రులు పీపీఈ కిట్లు ధరించి కరోనా వార్డుల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం, ఎమ్మెల్యే సంయుక్త సమన్వయంతో ఐసొలేషన్, క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాల్లో సకాలంలో మందులు, ఆహారం అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు జ్వర సర్వేను క్షేత్రస్థాయిలో సందర్శిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీ, ఎంపీపీ ఇలా అన్నిస్థాయిల్లో కరోనా మహమ్మారిపై పోరులో తలమునకలై బాధితులకు అండగా నిలుస్తున్నారు.