భవ్యక్షేత్రంగా వేములవాడ
శృంగేరి జగద్గురు పర్యవేక్షణలో పునర్నిర్మాణం.. రేపోమాపో శృంగేరికి ముఖ్యమంత్రి
దివ్యధామంగా కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి
శివ కేశవ అద్వైత నిలయం మన తెలంగాణ ప్రాంతం
ఆ సంప్రదాయానికి కొనసాగింపు
హరిహర అభేదానికి నిదర్శనంలా ముఖ్యమంత్రి
అద్భుత శైవ క్షేత్రంగా మారనున్న వేములవాడ రాజన్న సన్నిధి
కేసీఆర్ పెండ్లి జరిగింది ఇక్కడే
రాజన్నంటే కేసీఆర్కు ఎంతో భక్తి
పేదల దేవుడు ఎములాడ రాజన్న
దక్షిణ కాశీ.. రాజరాజేశ్వర క్షేత్రం..
క్రీ.శ. 1083లో గుడి నిర్మాణం
మత సామరస్యానికి ప్రతీక
బతుకమ్మ పండుగకు మూలం
ఓ ఎములాడ రాజన్నా.. మా దైవం నీవన్నా
మా దేవుడు నీవన్నా.. మా దిక్కే నీవన్నా
ఓ అన్నా రాజన్నా.. అన్నా రాజన్నా
నీ పూజకు నేనన్నా, రోజూ వస్తూ పోతున్నా
మా మనసులో నీవన్నా, మా మాటే నీదన్నా
ఓ అన్నా రాజన్నా.. అన్నా రాజన్నా
అని జానపదులు ఎలుగెత్తి ఆలపించినా…
శ్రీమౌనిస్తుత యుష్మదంఘ్రి యుగళిన్ సేవింతు లోకైక సం
క్షేమార్థంబు జగత్కుటుంబివగుటన్ జేకూర్చు మశ్రాంత ము
ద్ధామశ్రేయము సర్వ మానవులకున్ దాక్షిణ్యమేపారగన్
శ్రీమద్వేములవాడ దివ్యసదనా! శ్రీరాజరాజేశ్వరా!!
అని పండితులు శతక పద్యం పాడినా..
అది దక్షిణ కాశిగా పేరు గాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గురించే.. మన ఎములాడ రాజన్న గురించే.. ఆ వేములవాడ దివ్యధామాన్ని పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. యాదగిరి నర్సన్న దీవెనలతో ఎములాడ రాజన్న సేవకు కేసీఆర్ కదలబోతున్నారు. దీంతో పాటే వేల మంది భక్తులు దర్శించుకునే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి భవ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
జయహో.. నర్సన్నా.. రాజన్నా.. అంజన్నా..
ఇది మన తెలంగాణ భక్తి ఉద్యమమన్నా..
శివాయ విష్ణు రూపాయ/ శివ రూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః/ విష్ణూశ్చ హృదయగ్ం శివః
హైదరాబాద్, మార్చి 28 : శివుడు విష్ణువు రూపంలో ఉంటాడట. విష్ణువు శివుడి రూపంలో ఉంటాడట. శివుడి మనస్సులో విష్ణువుంటే, విష్ణువు హృదయంలో శివుడుంటాడట! శివుడైనా, విష్ణువైనా పరమాత్మ స్వరూపం ఒక్కటే. అనాది నుంచీ ఈ శివకేశవ అభేదానికి ఆలవాలం తెలంగాణ. ఈ హరిహరాద్వైతానికి నిలువెత్తు నిదర్శనం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. స్థితి కారకుడైన (నరుడు) విష్ణువు, లయ కారకుడైన (సింహం) శివుడి సమ్మేళనంగా కనిపించే యాదాద్రి నారసింహుడికి వేల ఏండ్లు నిలిచి ఉండే భవ్యమైన ఆలయాన్ని నిర్మించిన కేసీఆర్, ఆ యాదగిరి నర్సన్న ఆజ్ఞతో మరో మహత్కార్యానికి సంకల్పం చేశారు. యాదగిరి నర్సన్న దీవెనలతో వేములవాడ రాజన్న క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన ఏకాదశి రోజున ఆయన ఇందుకు సంకల్ప స్వీకారం, శ్రీకారం చేశారు. యాదగిరి క్షేత్రంలో కుంభాభిషేకం పూర్తయిన రోజే, ఆయన తన నిర్ణయాన్ని సన్నిహితులకు తెలియజేశారు. యాదాద్రి పునర్నిర్మాణ, పునర్వైభవ క్రతువిక భక్త జన సహకారంతో అవిచ్ఛిన్నంగా, అవిశ్రాంతంగా కొనసాగుతుందనీ, ఇక దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర క్షేత్ర వైభవానికి నాందీ ప్రస్తావన చేయాల్సిన తరుణం ఆసన్నమైందని కేసీఆర్ వారికి వివరించారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జగద్గురు ఆదిశంకర పీఠాధిపతులు శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శనం, ఆగమ నిర్దేశం మేరకు వేములవాడ పునర్నిర్మాణ ప్రక్రియ జరుగనున్నది. ఈ విషయంలో జగద్గురు భారతీతీర్థ స్వామి వారి అనుజ్ఞ, ఆశీస్సులు తీసుకొనేందుకు కేసీఆర్ అతి త్వరలో శృంగేరికి వెళ్లనున్నారు. క్రీ.శ.1083లో నిర్మితమైన వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం, ఒకప్పుడు తెలంగాణ ప్రాంతానికి రాజధానిగా వర్థిల్లిన ప్రాంతం. శైవ, వైష్ణవ, బౌద్ధ, జైన మతాలెన్నింటికో ఆలవాలం. సనాతన సంప్రదాయ వైదిక మతావలంబకులు వేములవాడకు ఎంత ప్రాధాన్యమిస్తారో, బోనాల జాతరల పోటెత్తే జానపదులూ రాజన్నను అంతే గాఢంగా అభిమానిస్తారు. అయితే తెలంగాణలోని అన్ని ధర్మక్షేత్రాల్లాగే వేములవాడ కూడా దశాబ్దాల వలస పాలనలో తీవ్ర అలక్ష్యానికి, నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ నదులు నదులు కావు. తెలంగాణ పుష్కరాలు పుష్కరాలు కావు.
తెలంగాణ క్షేత్రాలు క్షేత్రాలు కావు. తెలంగాణ దేవుండ్లు దేవుండ్లు కాదు… ఇలా సాగింది ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష. ఈ వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్ర ఎజెండా ఎత్తుకున్న కేసీఆర్, రాష్ర్టాన్ని సాధించుకోవడమే కాదు; గతించిన వైభవాలను ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వస్తున్నారు. తెలంగాణ నేల అన్నా, సంస్కృతీ సంప్రదాయాలన్నా ప్రాణం పెట్టే కేసీఆర్, పట్టుపట్టి ఒక్కొక్క మెట్టూ కట్టుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో వెలిసిందే నవ వైకుంఠం యాదాద్రి. ఇప్పుడు ఎములాడ రాజన్న వంతు. “కేసీఆర్ అటు సుదర్శన యాగమూ చేస్తాడు. ఇటు అయుత చండీ యాగమూ చేస్తాడు. శైవం, వైష్ణవమనే తేడాల కన్నా ఆయన దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. శివ కేశవులను సమానంగా పూజిస్తారు. ఇది చాలా కొద్దిమందిలో కనిపించే అరుదైన లక్షణం. ఆ లక్షణమే ఆయన్ను సర్వమత సమదరణీయుడిగా తీర్చిదిద్దుతున్నది” అని సోమవారం రాత్రి వేములవాడ అభివృద్ధిపై జరిగిన చర్చల్లో పాల్లొన్న పండితుడొకరు చెప్పారు. “కేసీఆర్ అనన్యసామాన్యమైన సంకల్ప శుద్ధి ఉన్నది. అంతకంటే ఎక్కువ సందర్భ శుద్ధి. పట్టిన పట్టు విడవకుండా చేయగల చిత్తశుద్ధి అనితర సాధ్యం. అన్నమాటను నిజం చేయగల వాక్శుద్ధి ఆయన సొంతం. అందుకే ఆయన నోటివెంట వచ్చిన మాట ఏదీ పొల్లు పోదు. ఆయన తెలపెట్టే ప్రతి కార్యమూ సిద్ధించడానికి కారణం… ఇద్ది సిద్ధులు ఆయన వద్ద ఉండడమే. యాదాద్రి తరహాలోనే వేములవాడ కూడా త్వరలో దివ్య వైభవ మహమాన్విత శివక్షేత్రంగా రూపుదిద్దుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు” అని ఆయన విశ్లేషించారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి అంటే, కేవలం గుడి పునర్నిర్మాణమో, అభివృద్ధో కాదనీ, వేములవాడ పట్టణం మొత్తాన్నీ అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేస్తారనీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాజన్న క్షేత్రంతో పాటు వేములవాడలో భీమేశ్వర క్షేత్రం, బద్ది పోచమ్మ గుడి మొదలైన అనేక దేవాలయాలున్నాయనీ, మొత్తం దక్షిణ, మధ్య భారత దేశం నుంచీ ఏటా వేల సంఖ్యలో భక్తులు వస్తారనీ, వారందరినీ ఆదరించి, అలరించే రీతిలో క్షేత్ర నగరి అభివృద్ధి జరుగుతుందనీ ఆ వర్గాలు వివరించాయి. ఆగమ సంబంధమైన సమస్యలు, ఆలయ సంబంధమైన ఇబ్బందులు లేకుండా పునర్నిర్మాణ బాధ్యత మొత్తాన్నీ శృంగేరీ జగద్గురువులకే అప్పగిస్తారనీ, పండితులు, శిల్పులంతా వారు సూచించిన మేరకే వస్తారనీ కూడా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వేములవాడకు వేదమూర్తుల వాడ అనే పేరు కూడా ఉన్నది. అటు పండిత, జానపదులందర్నీ మెప్పించే రీతిలో ఈ క్షేత్ర పునర్నిర్మాణం ఉంటుందని వెల్లడించాయి.
పునర్నిర్మాణ బాధ్యతలు సీఎల్ రాజంకు?
వేములవాడ రాజన్న పునర్నిర్మాణ బాధ్యతలను పారిశ్రామికవేత్త సీఎల్ రాజంకు అప్పగించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాజం కుటుంబ కుల దైవం వేములవాడ రాజన్న. వేములవాడను అభివృద్ధి కోసం ఆయన గతంలో కొన్ని ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేశారు. వేములవాడ అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా కూడా కొంత డబ్బు వెచ్చించారు. ఈ నేపథ్యంలో వేములవాడ పునర్నిర్మాణ బాధ్యతను సీఎం రాజంకు అప్పగించడమే సముచితమని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
శోభతో కేసీఆర్ పెండ్లి వేములవాడలోనే!
అందుకే రాజన్న అంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు సెంటిమెంట్, భక్తి
దక్షిణకాశిగా పేరుగాంచిన వేములవాడతో కేసీఆర్కు అవినాభావ సంబంధం ఉంది. కేసీఆర్ (అత్తగారి ఊరు) సతీమణి శోభ సొంత ఊరు వేములవాడ పక్కనే ఉన్న కొదురుపాక. కేసీఆర్కు 14 ఏండ్ల వయసులో శోభతో పెండ్లి అయింది. ఆ వివాహం జరిగింది ఎములాడ రాజన్న సన్నిధిలోనే! అందుకే వేములవాడ రాజన్న అంటే కేసీఆర్కు ప్రత్యేకమైన సెంటిమెంటు, భక్తి. “ఎములాడ రాజన్న నాకు శోభనిచ్చాడు. నా జీవితానికి శోభనిచ్చాడు. శోభను కల్యాణం చేసుకున్న తర్వాత నా జీవితం, నా కుటుంబం కల్యాణదాయకమైంది. తెలంగాణ రాష్ట్రం వంటి అసాధ్యమైన లక్ష్యాలను కూడా సాధించి, ప్రజల మన్ననలు చూరగొన్న సత్కుటుంబంగా నిలువగలిగింది. మరి నా జీవితానికి ‘శోభ’ నిచ్చిన రాజన్నకు నేను ఏమివ్వగలను. ఆయన సన్నిధికి సరికొత్త శోభ కలిగించడం తప్ప! నా తెలంగాణకు కల్యాణ కారకుడైన రాజన్నకు నేనేం చేయగలను… ఆ దేవదేవునికి అద్భుతమైన కల్యాణాన్ని జరిపించడం ద్వారా లోకకల్యాణాన్ని సాధించడం తప్ప” అని కేసీఆర్ తన సన్నిహితులతో తరచూ అంటూ ఉండేవారు. ఆ కల్యాణ ఘడియలు వచ్చాయనీ, ఎములాడ రాజన్న క్షేత్రం త్వరలోనే మహా దివ్య క్షేత్రంగా రూపుదిద్దుకోనుందనీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే వేములవాడకు 60 కోట్లు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించి, నేరుగా రూ.60 కోట్లు అందించారు. వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి, ముద్దసాని పురుషోత్తం రెడ్డి ప్రస్తుతం వైస్చైర్మన్గా నియమించారు. ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక ప్రతిపాదనలు సిద్ధం చేసారు. వాటికి తుది రూపం కూడా ఇచ్చారు. అలయ విస్తరణకు శృంగేరి పీఠాధిపతి కూడా అంగీకారం తెలిపారు. దీంతో రూ.60 కోట్లలో రూ.30 కోట్లు పెట్టి 34 ఎకరాల భూసేకరణ పూర్తి చేశారు. రూ.5 కోట్లతో మిషన్ భగీరథ పైపులైన్ వేశారు. దేవస్థానానికి వచ్చే రహదారుల విస్తరణకు రూ.50 కోట్లు వెచ్చించారు. పట్టణంలో రద్దీ ఉండకుండా రూ.5 కోట్లతో రెండు బైపాస్ రోడ్లను విస్తరించారు. ప్రధాన రహదారులకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. దేవస్థాన గుడి చెరువును సుందరీకరిస్తున్నారు. ఇందులో మినీట్యాంకు బండ్ నిర్మించి, 150 ఫీట్ల వెడల్పుతో రోడ్డును నిర్మిస్తారు. మధ్యలో 9ఎకరాల ఐలాండ్ను ప్రతిపాదించారు. రూ.12 కోట్లతో మూలవాగుపై రెండు వంతెనలు నిర్మిస్తున్నారు.