హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ గోపన్పల్లిలో తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక వసతులతో బ్రాహ్మణుల కోసం నిర్మించిన విప్రహిత భవనాన్ని ఈ నెల 31న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడు జోషి గోపాలశర్మ చెప్పారు. ధర్మాన్ని కాపాడుతున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరేనని కొనియాడారు. ధూపదీప నైవేద్యం పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ దేవాలయంలో పూజల నిర్వహణకు, హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రజానీకం ఆయురారోగ్యాలతో ఉండాలని ముఖ్యమంత్రి యజ్ఞ యాగాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సచివాలయం మీడియా సెంటర్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్నివర్గాలతోపాటు బ్రాహ్మణుల సంక్షేమానికి సైతం పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. 2016లో బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేయడంతోపాటు బ్రాహ్మణుల కుటుంబాలను ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేలా యాదగిరిగుట్ట ఆలయాన్ని తీర్చిదిద్దారని, కొండగట్టు, వేములవాడ ఆలయాల పునరుద్ధరణ పనులు అన్నీ సీఎం కేసీఆర్తోనే సాధ్యమయ్యాయని కొనియాడారు.
ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించడమేగాక, తెలంగాణను దేశానికి ఆదర్శంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని గోపాలశర్మ కొనియాడారు. బ్రాహ్మణులకు హైదరాబాద్లో ప్రత్యేకంగా భవనం ఉండాలని భావించి గోపన్పల్లిలో 6.18 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, ఆ భవనానికి సీఎం కేసీఆరే స్వయంగా విప్రహిత పేరు పెట్టారని గుర్తుచేశారు. 5 అంతస్థుల్లో భవనంలో 800 మందికిపైగా బ్రాహ్మణ విద్యార్థులకు వసతి, పోటీపరీక్షలకు శిక్షణ ఇచ్చేలా సకల హంగులను కల్పించారన్నారు. పీఠాధిపతులు, మఠాధిపతులకు గెస్ట్రూమ్లు నిర్మించారని తెలిపారు. ప్రారంభోత్సవానికి బ్రాహ్మణులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బ్రాహ్మణ సేవాసమితి పాలమూరు జిల్లా అధ్యక్షుడు గొంద్యాల రాఘవేంద్రశర్మ, కంచికామకోటి పీఠం పాలమూరుశాఖ ధర్మాధికారి తోలపల్లి శ్రీకాంతశర్మ, బ్రాహ్మణ సేవా సమితి పాలమూరు ప్రతినిధులు ఇరివింటి శ్రవణ్కుమార్ శర్మ, చంద్రకాంత్ చార్యులు, సృష్టి రఘురామశర్మ, ధీరం రాఘవేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.