ఎదురుగా సాగర గౌతముడు.. అదే హుస్సేన్సాగర తీరాన అమరుల స్మృతిచిహ్నం.. రెండింటి మధ్య సగర్వంగా తెలంగాణ నూతన సచివాలయం.. దాని పక్కనే సమున్నత శిఖరం. అంబరమంత ఎత్తున నిలబడి.. వెలుగు వైపు వేలు చూపుతూ స్వేచ్ఛా దేవర. పీడితుల సంకెళ్లు తెంచి జాతికి వేకువలా నిలిచిన నీలి సూర్యుడు. ఆయన చేతిలో భారత రాజ్యాంగం. ఆయన కలలుగన్న సమాజం దిశగా తెలంగాణ ఎలా వడివడిగా నడుస్తున్నదో తెలిపే దృశ్యమిది.
అంబేద్కర్ ఓ చైతన్యజ్యోతి.. ఆ వెలుగులో అడుగులేస్తున్నది తెలంగాణ. అంబేద్కర్ ఓ జ్ఞానఖడ్గం.. బలవంతుడిదే రాజ్యమైనచోట బలహీనుడికి అస్త్రమైనది అదే.
ఎవరి రాత దేశ తలరాతను మార్చిందో.. ఏ మహనీయుడి రాజ్యాంగం రాష్ర్టాన్ని ప్రసాదించిందో.. మెజారిటీ ఉన్నోడిదే చెల్లుబాటైన చట్టసభలో ఎవరి రక్షణఛత్రం కింద తెలంగాణ బిల్లు సాకారమైందో.. ఆ సమతామూర్తికి తెలంగాణ ఘన నివాళులర్పించనున్నది. భారత రాజ్యాంగ నిర్మాత భీంరావ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నేడు ఆవిష్కరణకు సిద్ధమైంది. ఆ సమసమాజమూర్తి మహా విగ్రహాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం జాతికి అంకితం చేయనున్నారు.
BR Ambedkar | హైదరాబాద్, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ సమీపంలో తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకకు వేళైంది. అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ సమాజంతోపాటు యావత్తు దేశ ప్రజలు సంబురపడేలా విగ్రహావిష్కరణ ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. ఇప్పటికే 125 అడుగుల ఎత్తులో నిర్మించిన అంబేదర్ మహా విగ్రహాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించనున్నారు. ఆవిషరణ సభకు ఉన్నతస్థాయిలో ఏర్పాట్లు చేశారు. అంబేదర్ స్మృతివనం ప్రాంగణంలోనే దాదాపు 40 వేల మందికి కుర్చీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎంపిక చేసిన ఆహ్వానితులు, మేధావులు, ప్రముఖులకు ఉత్సవ కమిటీ ఆహ్వాన పత్రికలను అందజేసింది.
ముఖ్య అతిథి ప్రకాశ్ అంబేద్కర్
అంబేద్కర్ మహా విగ్రహావిషరణకు ఆయన ముని మనుమడు ప్రకాశ్ అంబేదర్ను ముఖ్య అతిథిగా ప్రభుత్వం ఆహ్వానించింది. ఆయన హైదరాబాద్ చేరుకోగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ విమానాశ్రయానికి వెళ్లి ఘనస్వాగతం పలికారు. విగ్రహ రూపశిల్పి రామ్ వంజీ సుతార్కూడా హైదరాబాద్కు రానున్నారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమ వివరాలు
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
కేసీఆర్ ఆదేశాల మేరకు అంబేదర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లను మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. విగ్రహ ప్రాంగణం, సభాస్థలి, ప్రాంతాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, బుద్ధవనం చైర్మన్ లక్ష్మయ్య, కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ్ వెంట ఉన్నారు.