భారతదేశం మనందరిది. దీనిని సురక్షితంగా కాపాడుకుందాం. తెలంగాణ కోసం పోరాడినట్టుగానే ఉజ్వల భారతం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుదాం. రాజీపడే ప్రసక్తే లేదు. అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై (దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ, తప్పక కరుణిస్తాడు.)
-ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ‘చిత్తశుద్ధి, గట్టి సంకల్పంతో పని ప్రారంభించినప్పుడు గమ్యం చేరుకోవడానికి కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యం అవుతుండవచ్చు కానీ గమ్యం చేరుకోవడం మాత్రం ఖాయం’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నొక్కిచెప్పారు. తెలంగాణ కోసం పోరాడినట్టుగానే ఉజ్వల భారతదేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి లక్ష్యం చేరుకోవడం తథ్యమని స్పష్టంచేశారు. రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ఏటా ముస్లింలకు ఇచ్చే ఇఫ్తార్ విందును బుధవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేశారు. ఈ విందులో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
దేశం కోసం పోరాడాలి
మనం ముందుకు సాగుతున్నాం కానీ దేశం వెనుకబడిపోతున్నది. ఈ విషయాన్ని చెప్పేందుకు నేను ఇబ్బంది పడటంలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం తీరుగా శ్రమిస్తే దేశ జీడీపీ కనీసం మరో రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్లు పెరిగేది. ఈ విషయంలో మనం దెబ్బతిన్నాం. ఈ రోజు దేశం అగమ్యగోచర స్థితిలో పయనిస్తున్నది. ఈ విషయం మనందరికీ తెలుసు. భారతదేశం మనందరిది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం మన దేశాన్ని కాపాడుకోవాలని పెద్దలను, యువతను కోరుతున్నా.
చిన్నచిన్న కష్టాలు వస్తూనే ఉంటాయి. మీ సహకారంతో చివరి వరకూ పోరాడుతూనే ఉందాం. ఇది తాతాలిక దశ. ఈ సమయంలో ఒనగూరేదేం ఉండదు. తుదకు న్యాయమే గెలుస్తుంది. దేవుని వద్ద ఆలస్యం కావచ్చు కానీ చేరుకోవడం తథ్యం (అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై), తెలంగాణ కోసం పోరాడినట్టుగానే ఉజ్వల భారతదేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి లక్ష్యం చేరుకోవడం తథ్యం. ఈ దేశం మనందరిది. దీనిని సురక్షితంగా కాపాడుకుందాం. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుదాం. రాజీపడే ప్రసక్తే లేదు.
శక్తిని కాదు యుక్తిని ప్రయోగించాలి
ఈ దేశ గంగా జమున సంస్కృతిని, ఆచార సంప్రదాయాలను ఎవరూ మార్చలేరు. అలా ప్రయత్నించినవారే అంతమవుతారు. కానీ దేశం ఎన్నటికీ నిలిచే ఉంటుంది. నా మాటలపై నమ్మకం ఉంచండి. సమయం వచ్చినప్పుడు దేశాన్ని రక్షించుకోవడానికి శక్తిని కాకుండా యుక్తిని ప్రయోగించాలి. దేశాన్ని రక్షించుకోవాలని నేను మీకు విన్నవిస్తున్నాను. ప్రస్తుతమున్న దేశ రాజకీయ పరిస్థితులను మార్చేందుకు నేను దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాను. మహారాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. నా అంచనాలకు మించి ప్రజాదారణ లభిస్తున్నది. ఈ దేశం సరైన నాయకుడి కోసం, పార్టీ కోసం వేచి చూస్తున్నదనేది స్పష్టమైంది. ఈ దేశాన్ని రక్షించుకొనేందుకు మేం శాయశక్తుల కృషి చేస్తాం. యావత్ ముస్లిం సమాజానికి హృదయపూర్వకంగా మరోమారు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నా.
తెలంగాణకు పోటీయే లేదు
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడు కూడా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం ఆనందంగా ఉన్నది. 9 ఏండ్ల క్రితం మనల్ని వెనుకబడినవారిగా పరిగణించేవారు. కానీ నేడు అల్లా దయతో, మీ అందరి ప్రార్థనలతో తెలంగాణ రాష్ట్రానికి దేశంలో పోటీ అనేది లేదు. ఇది నేను చెప్తున్నది కాదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో మరే రాష్ట్రానికి లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,115 ఉన్నది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పెద్దపెద్ద రాష్ట్రాలకంటే మనం ముందంజలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తలసరి విద్యుత్తు వినియోగం 1,000-1,050 యూనిట్లు ఉండేది. నేడు అది 2,100 యూనిట్లకు పెరిగింది. పరిశ్రమలు, ఐటీ రంగంలో పురోగమిస్తున్న తీరును అందరూ గమనిస్తూనే ఉన్నారు.
అసదుద్దీన్ ఒవైసీ తదితరులు కోరినట్టుగానే అనీస్ ఉల్ గుర్బాను అత్యద్భుతంగా నిర్మించుకొన్నాం. బీఆర్ఎస్ పాలనకు పూర్వం ఈ ప్రాంతాన్ని 10 సంవత్సరాలపాటు కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఆ పదేండ్లలో ముస్లింలకోసం వారు రూ.1,200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 9 ఏండ్లలో రూ.12,000 కోట్లను ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ఖర్చుచేసింది. ఇవి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెలువరించిన గణాంకాలు. అసెంబ్లీ, సెక్రటేరియట్తోపాటు మైనారిటీ వెల్ఫేర్ సైట్లో ఆ వివరాలను చూడవచ్చు. గతంలోలాగా రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు లేవు. జీవన పోరాటంలో భాగంగా బయటి రాష్ట్రాలకు వెళ్లిన రైతులు నేడు వారివారి ఊర్లకు తిరిగి వచ్చారు.
నేడు తెలంగాణ రాష్ట్రంలో 94 లక్షల ఎకరాల్లో వరి పంటను పండించుకొన్నామని నేను గర్వంతో చెప్తున్నా. మొత్తం దేశంలో సాగుచేసిన వరి సాగు విస్తీర్ణం కంటే ఒక తెలంగాణలో వేసిన వరిసాగు విస్తీర్ణం చాలా ఎకువ. తాగునీరు, కరెంటు సమస్యలు నేడు లేవు. నిరుద్యోగ సమస్యను కూడా మెల్లమెల్లగా తొలగించుకొంటున్నాం అని సీఎం పేర్కొన్నారు.
ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు
ఇఫ్తార్ విందు ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్ ముస్లిం మతపెద్దల వద్దకు వెళ్లి పేరు పేరునా పలుకరించి అభివాదాలు తెలియజేశారు. ప్రసంగం అనంతరం ఇఫ్తార్కు హాజరైన ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. అజాన్ పిలుపు తర్వాత ఇస్లాం సాంప్రదాయ పద్ధతిని అనుసరించి తనతోపాటు ఆశీనులైన పలువురికి ఇఫ్తార్ విందును అందించి రోజాను విరమింపజేశారు. అనంతరం ప్రముఖులతో కలిసి విందులో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గువ్వల బాలరాజు, బేతి సుభాష్రెడ్డి, కాలేరు వెంకటేశ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, టెన్న్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు. ఇఫ్తార్కు దాదాపు 12 వేల మందికిపైగా ముస్లింలు హాజరయ్యారు. సీఎం కేసీఆర్కు మైనార్టీస్ వెల్ఫేర్ కమిషనర్ షఫీ ఉల్లా, మైనార్టీస్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్ ఘన స్వాగతం పలికారు. జ్ఞాపికతో పాటు భారతదేశపటంలో సీఎం కేసీఆర్ గారిని చిత్రించిన ఫొటోను ముఖ్యమంత్రికి బహూకరించారు.
మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట: మంత్రి కొప్పుల
తెలంగాణ ప్రభుత్వం ముస్లిం, మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఉదహరించారు. మైనారిటీ సంక్షేమంలో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ర్టాలకు దిక్సూచిగా నిలుస్తున్నదని చెప్పారు. రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు.
దేశం కోసం బీఆర్ఎస్: మంత్రి మహమూద్ అలీ
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అనేక విజయాలను సాధించిందని హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆదర్శంగా నిలుస్తున్నదని వివరించారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. దేశం కోసమే బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని, ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కోరారు.
అనాథ బాలలకు అభినందన
సీఎం కేసీఆర్ తొలుత అనాథ పిల్లలతో కాసేపు ముచ్చటించారు. వారి యోగ క్షేమాలతోపాటు చదువు వివరాలను అడిగి తెలుసుకొన్నారు. పిల్లలు ఇంగ్లిష్ భాషలో సంభాషిస్తుంటే ఆనందిస్తూ వారితో ముచ్చటించారు. వారి ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని ప్రశంసించారు. ఇంకా గొప్పగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రోత్సహించారు. అనంతరం పేదలకు రంజాన్ కానుకలను అందజేశారు.