హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): పల్లెలు, పట్టణాలను పచ్చదనంతో తీర్చిదిద్దడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వర్షాకాలం ప్రారంభం కాగానే రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చర్చించాల్సిన అంశాలపై ఎజెండాను ఖరారు చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్లపై కూడా చర్చిస్తారు. అలాగే ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై కలెక్టర్ల నుంచి సమాచారం తెలుసుకుంటారు. చివరిగింజ వరకు రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించనున్నారు. అలాగే జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తారు.