రంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మీ కండ్ల ముందే ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కొంగరకలాన్లో నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సముదాయ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.
రంగారెడ్డి జిల్లాకు కొత్తగా చక్కటి సమీకృత పరిపాలన భవనాన్ని నిర్మించి ప్రారంభించనందుకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం జరిగే సమయంలో రంగారెడ్డి జిల్లాలో అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేశారు. భూములు ధరలు పడిపోతాయని, రాష్ట్రం వస్తే లాభం ఉండదని చెప్పారు. మనకు కరెంట్, మంచినీరు ఇవ్వని వారు మనల్ని గోల్ మాల్ చేసే ప్రయత్నం చేశారు. పట్టుదలతో 14 ఏండ్లు పోరాడితే చాలా త్యాగాల తర్వాత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కొత్త జిల్లాలను సాధించుకున్నామని కేసీఆర్ తెలిపారు.
మీ గ్రామాల్లో అందరితో చర్చ పెట్టాలి. ఒక్కటే ఒక్క మాట మనవి చేస్తున్నా. ఏ సమయంలో గానీ, పురాణం, చరిత్ర చదివినా.. ప్రజలను చైతన్యం చేసే మేధావులు, యువత నిద్రాణమై ఉంటారో.. వాళ్లు చాలా బాధలు అనుభవిస్తారు. మన సొంత చరిత్రనే మనకు మంచి ఉదాహరణ. స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ స్టేట్గా ఉన్నాం. ఆ తదనంతరం నాటి నాయకత్వం ఏమరుపాటుగా ఉంటే మనం ఏపీలో భాగమయ్యాం. అనేక బాధలు పడ్డాం. ఉద్యమ సమయంలో అనేక సభల ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యం చేశాం. ఏపీ నుంచి బయటపడేందుకు 1969లో జరిగిన ఉద్యమంలో 400 మంది పిల్లలు బలయ్యారు. మలిదశ ఉద్యమంలో అనేక మంది చనిపోయారు. అహింసా పద్ధతిలో ముందుకు పోయిప్పటికీ అనేక బాధలు అనుభవించాం.
బయటపడ్డ తర్వాత ఇక్కడ జరుగుతున్న విషయాలు, కలుగుతున్న సదుపాయాలు మీ కండ్ల ముందే ఉన్నాయి. మీరందరూ వాటిని చూస్తున్నారు. ఇవాళ ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు, రైతుల పథకాలు అమలవుతున్నాయి. రైతుబీమా సదుపాయం యావత్ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఓ గుంట ఉన్న రైతు చనిపోయినా వారం పది రోజుల్లో రూ. 5 లక్షలు బీమా కింద జమ అవుతున్నాయి. వేరే చోట రైతులు చాలా బాధలు పడుతున్నారు. కానీ తెలంగాణ రైతులకు ఆ బాధలు లేవు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం. దళారీ వ్యవస్థకు స్వస్తి పలికాం. డబ్బులు రెండు మూడు రోజుల్లోనే జమ అవుతున్నాయి. ఆ విధంగానే రైతుబంధు డబ్బులు మీ ఖాతాల్లో జమ అవుతున్నాయి. రైతుల అప్పులు చేయకుండా పంటలు పండిస్తున్నారు. 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఈ విషయాలు కొత్తవి కావని కేసీఆర్ స్పష్టం చేశారు.