హైదరాబాద్ : గిరిజన, మైనార్టీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన తీర్మానం సందర్భంగా టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. దేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పరిస్థితి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ఎందుకంటే అనేక దశాబ్దాల పోరాటం తర్వాత రాష్ట్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు అవసరమవుతాయి. గిరిజన జాతి ప్రజలు మన దగ్గర ఎక్కువగా ఉన్నారు. ఏపీలో ఉన్నప్పుడు వారి సంఖ్య 6 శాతంగా ప్రకటించి, అంతే రిజర్వేషన్లు కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడు వారి సంఖ్య 10 శాతానికి మించిపోయింది. దానికనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకుంటామని, తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపాం. మైనార్టీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా తీర్మానం పంపినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదన్నారు కేసీఆర్.
దురదృష్టం ఏంటంటే కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు. ఏడేండ్ల నుంచి పెండింగ్లో ఉందని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నిసార్లు ప్రత్యక్షంగా ప్రధానికి విన్నవించినా కూడా దాని మీద చర్య లేదు. ఇంకా దురదృష్టకరమంటే 50 శాతం రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. కానీ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని సవరించే అధికారం కేంద్రానికి సంపూర్ణంగా ఉంది. దురదృష్టం ఏంటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. చాలా చిత్రవిచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఆ విధంగా మనం చేసుకుంటామంటే అనుమతివ్వరు. ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో అనేక వర్గాలకు వారి జనాభాకు అనుసరించి రిజర్వేషన్లు అమలు కావడం లేదు అని కేసీఆర్ తెలిపారు.