హైదరాబాద్ : జై తెలంగాణ నినాదంతో ఏదైతే తెలంగాణ సాధించి, ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగినామో, ఈ రోజు జై భారత్ నినాదంతో మనందరం పురోగమించి అద్భుతమైన భారతావని నిర్మాణం కోసం ఈ క్రిస్మస్ సందర్భంలో అంకితం అవుదామని, అందుకోసం మీ ఆశీస్సులు, అండదండలు అన్ని కావాలని కోరుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తప్పకుండా యావత్ సమాజం ముందుకు పురోగమించే అవసరం ఉంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇది సందర్భం కాబట్టి ప్రత్యేకించి ఒక మాట మీకు మనవి చేస్తున్నాను. ఒక 20 ఏండ్ల క్రితం అశాంతితో, వలసలతో, ఆత్మహత్యలతో, దిక్కు తోచని స్థితిలో భయంకరమైన వివక్షకు గురవుతూ చిన్నబుచ్చుకున్నటువంటి తెలంగాణ సమాజాన్ని చూసి ఈ సమాజానికి మేలు జరగాలని జై తెలంగాణ అనే ఒక నినాదంతో మనం ఒక యుద్ధాన్ని ప్రారంభించాం. ఆ రోజు అనేక మంది పైన, కింద ఉన్న మిత్రులు కానీ నాతో పాటు నడుస్తూ నడుస్తూ చివరకు మనం విజయం సాధించాం. ఆ విజయం పరంపరలో భాగంగా ఏం జరుగుతుందో మన వారు చెప్పారు. కులం, మతం, వర్గం, జాతి అనే వివక్ష లేకుండా అందరితో అన్ని విషయాలు పంచుకుంటూ అన్ని పండుగలను చాలా గొప్పగా, ఉన్నంతలో ఘనంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా, సంతోషంగా మనవి చేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఏడేండ్ల క్రితం మన తలసరి ఆదాయం లక్ష ఉండేది. ఈ రోజు అనేక పెద్ద పెద్ద రాష్ట్రాలను అధిగమించి ఇవాళ మన తలసరి ఆదాయం 2 లక్షల 75 వేలు. పర్ క్యాపిట పవర్ యుటిలైజేషన్లో గానీ, ఇంకాఇతర అనేక విషయాల్లో గానీ నంబర్ వన్, నంబర్ టు స్థానానికి తెలంగాణ రాష్ట్రం పురోగమించింది. మీ అందరితో కూడా మనవి చేసేది ఏందంటే ఇది రాజకీయ వేదిక కానప్పటికీ ఒక మంచి కోసం జరిగే ప్రయత్నంలో అందరం భాగస్వాములం కావాలి. తెలంగాణ సాధించినటువంటి పురోగతి యావత్ దేశంలోని అన్ని మారుమూల రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో రావాలి అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. దాని కోసమే మళ్లీ మనం కొత్త యుద్ధానికి, కొత్త సమరానికి శంఖం పూరించాం. తప్పకుండా తెలంగాణ మాదిరిగానే భారతదేశం అన్ని రకాలుగా పురోగమించి, ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, శాంతికాముక దేశంగా, పురోగమించే దిశగా మనకు విజయం చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందులో మీ అందరి సహకారాన్ని కూడా నేను కోరుతున్నాను అని కేసీఆర్ తెలిపారు.
కొన్ని సమస్యల గురించి ఆంటోనీ నాకు చెప్పారు అని కేసీఆర్ గుర్తు చేశారు. క్రైస్తవ మతపెద్దలతో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో నేను ఒక సమావేశం నిర్వహించి, జరగవలిసిన పనుల గురించి, అవసరమైన అన్ని చర్యలను తప్పకుండా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఆ దిశగా మనం పురోగమిద్దామని ఆశిస్తూ దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని తెలిపిన కేసీఆర్ జై భారత్ నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు.