హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశమంతా పర్యటిస్తాను.. కార్యక్షేత్రం వదలనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదని తేల్చిచెప్పారు. ఉజ్వల భారతం తయారు కావాల్సిన అవసరమున్నది. మన దేశంలోని వనరులు, మన దేశంలోనే వాడితే అమెరికా కంటే గొప్పగా అభివృద్ధి చెందుతామని పేర్కొన్నారు. మనకు ఇంకా మంచి సమయం ఉన్నది. మనం దేశవ్యాప్తంగా విస్తరిస్తం. మొట్టమొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్రను ఎంచుకుంటం. మన జాతీయ పార్టీ కి అనుబంధ రైతు సంఘటన ను మొదట మహారాష్ట్ర నుంచే ప్రారంభిస్తామని కేసీఆర్ తెలిపారు.
భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటన సందర్భంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సర్వసభ్య సమావేశం సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ వల్ల దేశానికి మంచి జరిగితే అది దేశ చరిత్రలో స్థిర స్థాయిలో నిలిచిపోతుందన్నారు. దళిత ఉద్యమం, రైతు ఉద్యమం, గిరిజన ఉద్యమం ద్వారా వీటిని ప్రధాన ఎజెండాగా తీసుకోని ముందుకు సాగుతాం. దేశవ్యాప్తంగా వున్న అనేక సామాజిక రాజకీయ రుగ్మతలను తొలగిస్తాం. ఇప్పటికే తెలంగాణ ఆచరించి దేశానికి చూపించింది. తలెత్తున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతాం.
తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు తీసుకపోయినట్టుగానే, దేశాన్ని ముందుకు తీసుకపోవాలె. తెలంగాణలో ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేసి సాధించినం. పల్లెలు పట్టణాలను అభివృద్ధి పరుచుకున్నం. కేంద్రం ప్రకటించిన అవార్డులే అందుకు సాక్ష్యం. ఒక అద్భుతమైన తాత్విక పునాదితో ముందుకు సాగుతాం. దేశవ్యాప్తంగా సాగే క్రమంలో అందరి సహకారం అవసరం. ఎట్లయితే పట్టుదలతో తెలంగాణ ప్రజలను గెలిపించినమో.. అదే పద్దతిలో దేశ ప్రజలను కూడా లక్ష్య సాధనలో మనం గెలిపిస్తాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.