హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ వివరణాత్మక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించి, అనుమానాలను నివృత్తి చేశారు సీఎం కేసీఆర్. హోంగార్డులకు మంచి జీతాలు ఇస్తున్నాం. ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్ ఇస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. సెక్రటేరియట్లో గుడి, మసీదును అందంగా తీర్చిదిద్దుతాం. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయమని సీఎం స్పష్టం చేశారు.
ఇండియా మొత్తంలో కూడా గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నరేగా కార్యక్రమం జరుగుతోంది. నిజానికి వాస్తవం చెప్పాలంటే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన తర్వాతే డబ్బుల వినియోగం పెరిగింది. పని దినాలు పెరిగాయి. అసెట్స్ క్రియేట్ అవుతున్నాయి. చాలా అక్రమాలు జరిగాయి. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ ప్రతిపాదనను విచారించి నిర్ణయం తీసుకుంటాం.
కేజీ టు పీజీ కార్యక్రమానికి నేనే రూపకల్పన చేశాను. మంచి విద్యను అందిస్తే ప్రపంచంతో పోటీపడి బతుకుతారు. గురుకుల పాఠశాలలు ప్రారంభించడానికి ముందు మేధావులతో మాట్లాడాను. ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఇవాళ గురుకులాల్లో పెట్టే డైట్ను కూడా నేనే తయారు చేశాను. ఐదో తరగతి లోపు పిల్లలను గురుకులాల్లో వేస్తే హోం సిక్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. మేధావులు, చైల్డ్ సైకాలజిస్టుల సూచనల మేరకు ఐదో తరగతి నుంచి గురుకులాలను ప్రారంభించాం. ఇండియాలోనే ఎక్కడ లేనన్ని గురుకులాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. నాణ్యమైన విద్యను అందిస్తూ.. కడుపునిండా భోజనం పెడుతున్నాం. గురుకులాలకు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నాం.
డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టే చోట ప్రభుత్వమే జాగాలు తీసుకుని నిర్మిస్తుంది. హైదరాబాద్లో బహుళ అంతస్తుల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నాం. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఈ ఇండ్లు నిర్మించి ఇస్తున్నాం. సొంత జాగాల్లో ఇండ్లు నిర్మించుకునేవారికి నగదు అందిస్తాం. కరోనా వల్ల ఆలస్యమైంది. వంద శాతం ఈ స్కీంను త్వరలోనే ప్రారంభిస్తాం. నియోజకవర్గానికి వెయ్యా, పదిహేను వందలు ఎంత అనేది ఆలోచిస్తామన్నారు సీఎం కేసీఆర్.