CM KCR | ఎన్ని త్యాగాలు.. ఎన్ని పోరాటాలు.. ఆవేదనలతో స్వాతంత్య్రం సిద్ధించింది.. ఆ స్ఫూర్తిని అందరికీ తెలిసేలా వాడవాడలా.. గ్రామగ్రామాన అద్భుతంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు హెచ్ఐసీసీలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదట సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగుర వేసి, జెండావందనం చేశారు. ఆ తర్వాత భరతమాత, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలవేశారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు. ‘అనేక త్యాగాలతో, అనేక పోరాటాలతో స్వాతంత్య్రాన్ని సముపార్జించి 75 సంవత్సరాలు స్వయంపాలనలో అప్రతిహాతంగా ముందుకుసాగుతున్న భారతావని. 75 సంవత్సరాలు రేపు రాబోయే 15వ తేదీకి పూర్తి చేసుకుంటుంది. సుదీర్ఘకాలం స్వయంపాలనలో సుసంపన్నమైన భారతదేశంలో తరాలు మారుతున్నాయ్. కొత్త తరాలు వస్తున్నాయ్. వారికి స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన సమరం, త్యాగాలు కొత్త తరానికి తెలియవు. ఎప్పటికప్పుడు సందర్భోచితంగా కొత్త తరం వారికి తెలియజేయడం పాతతరం వారి కర్తవ్యం, విధి’ అని అన్నారు.
ఏ దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఒక అపురూపమైన సందర్భమని సీఎం కేసీఆర్ అన్నారు. ‘భారత స్వాతంత్య్రం కూడా సుదీర్ఘమైన పోరాటం. సుమారు ఒకటిన్నర శతాబ్దం పాటు కొనసాగిన పోరాటం. అనేక మంది పెద్దలు, అనేక రకాల పద్ధతుల్లో వలస పాలకులకు వ్యతిరేకంగా అపురూపమైన త్యాగాలు చేస్తూ పోరాటాలు చేశారు. దాంట్లో ప్రధానంగా 1857 సిఫాయిల తిరుగుబాటును తీసుకుంటాం. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విశేషమేంటంటే.. సిఫాయిలు తిరుగుబాటు రాజ్యం పడిపోవాలి. విప్లవపంథాలో విప్లవాలు చెలరేగి.. విప్లవ శక్తులు విజయం సాధించిన వేళకూడా రాజ్యానికి సహకరించే సగం మంది విప్లవకారులతో కలిసినప్పుడే విజయం సాధిస్తుంది.
అట్లాగే సాయుధ బలగాలు పోరాటం, తిరుగుబాటు చేస్తే రాజ్యంపోవాలే. కానీ, భారత స్వతంత్ర సమరంలోని ఉజ్వలఘట్టం ఆ నాటి బ్రిటిష్ వలస రాజ్యం కూలిపోలే. ఆ తర్వాత బలంగా అణచివేత ప్రారంభించారు. అయినా స్వతంత్ర ఉద్యమకారులు సిపాయిల తిరుగుబాటు లాంటి అరూపఘట్టమే ఫెయిల్ అయ్యిందని ఎనూడు నిరాశ చెందలే. అదే స్ఫూర్తితో వైఫల్యాన్ని పాఠంగా నేర్చుకొని పోరాటాన్ని కొనసాగించారు. బాలగంగాధర్ తిలక్ నేతృత్వంలో అనేక సాంస్కృతిక పోరాటాలు వచ్చాయ్. లాలాలజపతిరాయ్, బిపిన్చంద్రపాల్ ఇలా అనేక మంది పోరాటాలు చేశారు. ఝాన్సీ లక్ష్మీభాయి, ఎంతో మంది రాజులు, సంస్థానాదీశులు యావత్ ఆసేతుహిమాచలం ఒకటై పోరాటం జరిపారు’ అని సీఎం కేసీఆర్ కొనియాడారు..
‘బారిష్టర్ చదువుకొని, చాలా సందించుకునే అవకాశాలుండి.. గొప్ప అడ్వకేట్గా పేరున్న మహాత్మా గాంధీ.. ఆయన స్వతంత్ర సమరానికి నాయకత్వం వహించి.. నడుం బిగించారు. దక్షిణాఫ్రికాలో ఎదుర్కొన్న జాతివివక్ష, అనేక వ్యవహారాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపి.. నాజాతి కూడా ఇదే పద్ధతిలో పోరాటం చేస్తుందని ఆయన భారత్కు రావడం జరిగింది. చాలా గొప్ప బిడ్డను కన్నది మన భరత మాత. భారతదేశ స్వతంత్ర సముపార్జన సారథే కాదు.. యావత్ ప్రపంచానికే అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతిదూత, విశ్వమానవుడు మన మహాత్మాగాంధీ. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉండే కాలంలో.. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగిన సందర్భంలో ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా వచ్చారు.
పార్లమెంట్ జాయింట్ సెషన్లో ప్రారంభించారు. ఉపన్యాసం ప్రారంభించే సమయంలో విలువైన మాట చెప్పారు. ఆ రోజు మన భారతీయులందరి గుండెలు పులకిపోయాయి. వ్యక్తిగతంగా నేను గర్వపడ్డాను. ‘గాంధీ గారు ఈ ప్రపంచంలో పుట్టకపోయి ఉంటే.. ఒబమా అనే నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదు’… ఇది అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాట. ఐన్స్టిన్ శాస్త్రవేత్త మహాత్మాగాంధీ అనే వ్యక్తి రక్తమాంసాలతో పుట్టి ఈ భూమిమీద నడయాడుతడు అనుకోలేదు.. అంతటి మహాత్ముడి అని ఐన్స్టీన్ చెప్పారు. ఆఫ్రికాలో ఎంతో పోరాటంచేసిన నెల్సన్ మండేలా.. నాకు ప్రముఖమైన స్ఫూర్తి ప్రధాత గాంధీ అని చెప్పారు. గాంధీ విశ్వమానవుడు.. ఆయనను కన్న గడ్డ నా భరత జాతి. అటువంటి జాతికి వారసులం మన అందరం’ అని అన్నారు.
‘మనం ఎంతో గర్వంగా, సంతోషంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాత్మాగాంధీ వారసులుగా ఈ దేశ భవిష్యత్ను తీర్చిదిద్దడానికి కంకణంకట్టుకున్న వ్యక్తులుగా మనం ప్రజాసేవరంగంలో మునిగి ఉన్నాం. మీ అందరికీ శ్రమ ఇచ్చి రాష్ట్రం నలుమూల నుంచి పిలిపించిన కారణం ఏంటంటే.. ఒక మహోజ్వలమైనటువంటి స్వతంత్ర వజ్రోత్సవ దీప్తి.. వాడవాడల గ్రామగ్రామాన చాలా అద్భుతంగా జరగాలి. చాలా గొప్పగా ఎన్ని త్యాగాలతో,ఎన్ని రకాల పోరాటాలతో, వేదనలు.. ఆవేదనలతో స్వాతంత్య్రం వచ్చిందో ప్రతిగడపకు తెలిసేలా నిర్వహించాలి. జిల్లాలో మంత్రుల ఆధ్వర్యంలో కమిటీలు ఉన్నయ్.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు అందరు తమ పరిధిలో ఉజ్వలం నిర్వహించాలని, ఆ స్ఫూర్తిని ఈ వేదికగా మీరు పొంది తిరిగి మీ మీ గ్రామాలు, పట్టణాల్లో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు రప్పించాం అని మనవి చేస్తున్నా’ అన్నారు. ‘ఏయే సందర్భంలో ఎవరు త్యాగాలు చేశారు, ఎన్ని రకాల పోరాటాలు చేశారు.. అలవోకగా తమ అసువులు, ఆయుష్షును దేశ స్వాతంత్య్రం కోసం ధారబోశారు.. మరణానికి వెనుకాడకుండా.. మడమ తిప్పకుండా పోరాటాలు చేశారు.. అలాంటి స్ఫూర్తి, త్యాగనీరతితో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది’ అన్నారు.