CM KCR | ఖమ్మం : ఎన్నికల్లో ఓటును అలవోకగా వేయొద్దు.. మీ తలరాత మార్చేది.. భవిష్యత్ను తీర్చిదిద్దేది మీ ఓటే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇల్లందు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇల్లందు చాలా ఉద్యమాలు జరిగిన ప్రాంతం.. చాలా చైతన్యం ఉండే ప్రాంతం.. పోరాటాల పురిటిగడ్డ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీకి ఒకరు నిలబడుతారు. బీఆర్ఎస్ తరపున హరిప్రియ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తరపున ఎవరో ఒకరు నిలబడుతారు. నవంబర్ 30న ఎన్నికలు జరిగేది ఖాయం.. డిసెంబర్ 3న ఎవరో ఒకరు గెలిచేది ఖాయం. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గుడస్తుంది. రాజకీయ పరిణితి, ప్రజాస్వామి పరిణితి రావాల్సిన అసవరం ఉంది. ఇది గంభీరమైన సమస్య. ఒక ఒరవడిలో కొట్టుకుపోకుండా, పైసలకు, ప్రలోభాలకు ఓటు వేయొద్దు. మీరు ఆలోచించి చైతన్యంతో నిజమేదో ఆలోచించి ఓటు వేయాలి. ఎన్నికల్లో ప్రజలు గెలిచే స్థితి రానంత వరకు ఈ దేశం ఇలానే ఉంటదని కేసీఆర్ అన్నారు.
మీలో ఒకడిగా, కొట్లాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా చెబుతున్నాను.. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ ఏదీ..? చరిత్ర ఏందీ..? దృక్పథం ఏంది..? ప్రజల గురించి ఏం ఆలోచిస్తుంది ఆ పార్టీ అని తెలుసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడతుంది. మంచి ప్రభుత్వం గెలిస్తే మంచి పనులు జరుగుతాయి. చెడు ప్రభుత్వం గెలిస్తే చెడ్డ పనులు జరుగుతాయి. కాంగ్రెస్, టీడీపీ పాలన చరిత్ర మీకు తెలుసు. అందరి చరిత్రలు మీ చేతిలో ఉన్నాయి. వ్యవహారశైలి, నడకలు, వారు అవలంభించిన పద్దతులు మీ ముందున్నాయి. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. స్థిరంగా ఆలోచించాలి. ఏం చేస్తే లాభం జరుగుతదో ఆ దారి పట్టాలి. అదే ప్రజాస్వామ్యానికి దారి. ఓటును అలవోకగా వేయొద్దు. తమాషా కోసం వేయొద్దు. కారణం ఏందంటే ఈ దేశంలో ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు. మీ తలరాత మార్చేది.. భవిష్యత్ను తీర్చిదిద్దేది మీ ఓటే. హైదరాబాద్లో మేం పని చేస్తున్నామంటే అది మీరు ధారపోసిన శక్తే. మీ శక్తి లేకపోతే మేం చేసేది ఏం లేదు. ఓటు వేసే ముందు నిజమైన పంథా ఎంచుకోవాలి అని కేసీఆర్ సూచించారు.
మన అమూల్యమైన ఓటు సన్నాసికి వేస్తున్నామా..? సరైన వ్యక్తికి వేస్తున్నామా..? అని ఆలోచన చేయకపసోతే మనమే ఓడిపోతాం అని కేసీఆర్ అన్నారు. మన బతుకులను ఎవరు మార్చలేరు. ఈ విషయాలను మీరు ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు జరిగాయి మీకు తెలుసు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది పది.. చేసింది వంద. దళితబంధు పెట్టమని ఎవరూ చెప్పలేదు. ఇంటింటికి మంచినీళ్లు ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలేదు. రైతుబంధు, రైతుబీమా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు.. కానీ చేసుకుంటూ పోయాం అని కేసీఆర్ పేర్కొన్నారు.