CM KCR | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం.. తదితర అంశాలపై మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్మిట్టల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శులు రాజశేఖర్రెడ్డి, భూపాల్రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వడగండ్ల వానలతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లిన నేపథ్యంలో, ఇటీవల సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా నష్టపోయిన పంటలకు ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని మంగళవారం నాటి సమీక్షలో అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి, జరిగిన పంటనష్టంపై పూర్తి వివరాలను అందజేయాలని తెలిపారు. ఈ మేరకు తక్షణ చర్యలు ప్రారంభించాలని చీఫ్ సెక్రటరీని, వ్యవసాయ శాఖను సీఎం ఆదేశించారు. బాధిత రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఈ నిధులను జమ చేయాలని స్పష్టంచేశారు.
రెండోవిడత గొర్రెల పంపిణీకి చర్యలు
రెండోవిడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని, ఆ గొర్రెల పంపిణీ వ్యవహారాలు సాగాలని స్పష్టంచేశారు. రెండో విడతలో రూ. 6వేల కోట్ల ఖర్చుతో 3.63 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
పేదల ఇండ్ల నిర్మాణానికి సాయం
ఖాళీ జాగ ఉన్న పేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ప్రకటించిన రూ. 3 లక్షల ర్థికసాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించి, ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.
పోడు భూముల పంపిణీకి సంసిద్ధత
రాష్ట్రంలో పోడు భూముల్లో అర్హులైనవారికి పట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పట్టాల పంపిణీకి సిద్ధంగా ఉన్నామ అధికారులు తెలిపారు. 4 లక్షల ఎకరాలకు సంబంధించి.. లక్షా 55 వేలమంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు పాస్బుకులు ముద్రించి సిద్ధంగా ఉంచినట్టు వారు వివరించారు. ప్రభుత్వ నిర్ణయం కోసం తాము సిద్ధంగా ఉన్నాయని వారు పేర్కొనగా.. పోడు పట్టాల పంపిణీ కోసం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు.
సీతారాముల కల్యాణానికి కోటి రూపాయలు
శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేకనిధి నుంచి కోటి రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా భద్రాచల దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో.. దేవాదాయశాఖ అభ్యర్థన మేరకు, కల్యాణ నిర్వహణ కోసం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు