ముంబై: బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో జాతీయ స్థాయి కూటమిని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కితాబిచ్చారు. కేసీఆర్కు అన్ని పార్టీల మద్దతు కూడగట్టి కూటమిని ఏర్పాటు చేసే సత్తా ఉన్నదని అన్నారు. ఆదివారం ముంబైలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో కేసీఆర్ సమావేశమై కొత్త కూటమి గురించి చర్చించారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్కు కూటమిని ఏర్పాటుచేసే సత్తా ఉందంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. కూటమి ఏర్పాటు వ్యూహంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదివారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్పవార్లతో విడివిడిగా సమావేశమయ్యారు. ఠాక్రేతో మూడు గంటలు, ఆ తర్వాత శరద్పవార్తో రెండున్నర గంటలు మంతనాలు జరిపారు.
ఠాక్రేతో భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించారు. అనంతరం ఇద్దరూ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే, వీరి భేటీలో కాంగ్రెస్ రహిత కూటమి ప్రస్తావన వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అలాంటి ప్రస్తావనేమీ రాలేదని సంజయ్ రౌత్ తెలిపారు. కాంగ్రెసేతర రాజకీయ ఫ్రంట్ గురించి తాము ఎప్పుడూ చర్చించలేదని చెప్పారు.
గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సైతం బీజేపీని ఎదుర్కోవడానికి కూటమి ఏర్పాటు అంశంపై మాట్లాడినప్పుడు కూడా తమ పార్టీ కాంగ్రెస్ లేకుండా కూటమి సాధ్యంకాదని స్పష్టం చేసిందని రౌత్ గుర్తుచేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్లతో కలిసి శివసేన ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నది. అందుకే సంజయ్ రౌత్ కాంగ్రెస్ లేని కూటమిపై మాట్లాడలేకపోతున్నారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.