హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్ అత్యంత దారుణంగా ఉందని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని సీఎం మండిపడ్డారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ వాళ్లు కూడా దేశానికి ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత ఈ సిపాయి నరేంద్ర మోదీ వచ్చిండు. గుజరాత్లో ఏదో పొడిచినట్టు.. నాలుగు బొమ్మలు దొంగ సోషల్ మీడియాలో పెట్టి.. పూర్తి పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి సోషల్ మీడియాలో దొంగ ప్రచారాలతో.. తల తోక లేని గుజరాత్ మోడల్ను తీసుకొచ్చారు. గుజరాత్ మోడల్ను ఉద్దరిస్తారని చెప్పి నమ్మి ప్రజలు ఓటేశారు. ఎనిమిదేండ్లు గడిచాక ఆయన బండారం బయటపడ్డది. బీజేపీకి, మోదీకి ఉన్న తెలివి ఏందో స్పష్టంగా ఇవాళ బయటపడింది.
ఈ బడ్జెట్ దిక్కుమాలినతనంగా ఉంది. పేదలకు, రైతులకు మొండి చేయి చూపించింది. కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదు. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. పవిత్రమైన గంగానదిలో శవాలు తేలేలా చేసింది. లక్షల మంది ప్రజలకు రైలు టికెట్టు కూడా ఇవ్వలేదు. చాలా మంది చనిపోయారు. కరోనా సమయంలో ఘోరంగా విఫలమయ్యారు.
మిడతలు వస్తాయని భయపడ్డాం. గుజరాత్, రాజస్థాన్ బోర్డర్లో మాత్రమే వచ్చి పోతాయి. కానీ పోయినా సారి హర్యానా, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ బోర్డర్ వరకు వచ్చాయి. మనం కూడా సన్నద్ధం అయ్యాం. ఎంటమాలజిస్టులు వస్తే మన పంటలను కాపాడుకోవాలని, హెలికాప్టర్లో ఆదిలాబాద్ బోర్డర్ తరలించాం. ఆ మిడతలను చంపేశారు. మన దగ్గరికి మిడతలు రాలేదు. అయితే ఆ తర్వాత ఓ మీటింగ్ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానంతో మిడతలను నియంత్రించొచ్చు కదా అని అడిగాను. మానవజాతితో పాటు ఇవన్నీ ఉంటాయి. కరోనాలాంటి, మిడతలాంటి, ఫ్లూ లాంటి వైరస్లు 8 లక్షల సంవత్సరాల ముందే వచ్చాయి. వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడే విజృంభించి, మనషులను చంపేస్తాయని చెప్పారు. దీని నివారణ ఎట్లా అని అడిగితే.. తెలివి ఉన్న ప్రభుత్వాలు ఆరోగ్య వనరులను పటిష్టం చేసుకుంటాయి. తద్వారా తక్కువ నష్టాలతో బయటపడుతారు అని చెప్పిండు. ఆరోగ్య రంగ సదుపాయాలు పటిష్టం చేయాలని చెప్పారు.
ఈ నేపథ్యంలో టిమ్స్ కింద ఆరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. వెంటిలేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నాం. భవిష్యత్లో అనుకోని వైరస్లు వచ్చినా ప్రజలను కాపాడుకుంటాం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఆరోగ్య సదుపాయాలను పెంచుకుంటున్నాయి. కానీ నిర్మలా సీతారామన్ ఆరోగ్య రంగానికి నిధులు పెంచలేదు అని కేసీఆర్ ధ్వజమెత్తారు.