CM KCR | హైదరాబాద్ : ఇకపై తెలంగాణలోని అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఆర్ఫాన్ పాలసీని రూపొందించినట్లు పేర్కొన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
60 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో అనాథ పిల్లల సంరక్షణ కోసం ఒక విధానమంటూ లేకపోవడం అత్యంత విషాదకరం అని కేసీఆర్ అన్నారు. పరిపాలనలో మానవీయ పరిమళాలు వెదజల్లుతున్న తెలంగాణ ప్రభుత్వం అనాథ పిల్లల సంరక్షణ బాధ్యతను సంపూర్ణంగా స్వీకరించింది. వారిని “స్టేట్ చిల్డ్రన్” గా పేర్కొంటూ ఉన్నతమైన, ఉదాత్తమైన పద్ధతిలో ఆర్ఫాన్ పాలసీని రూపొందించింది. ఇకపై అనాథ పిల్లలను రాష్ట్ర ప్రభుత్వమే అక్కున చేర్చుకుంటుంది. ముఖ్యంగా అనాథలైన ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించడంతోపాటు, వారికి విద్యాబుద్ధులు నేర్పించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవరకూ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది అని కేసీఆర్ స్పష్టం చేశారు.