CM KCR | వికారాబాద్ : వికారాబాద్ నియోజకవర్గానికి ఏడాది లోపు పాలమూరు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నది నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, మెతుకు ఆనంద్కు మద్దతుగా ప్రసంగించారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను కాంగ్రెస్ నాయకులే అడ్డుకున్నరు. ఆ ప్రాజెక్టు మీద 196 కేసులు వేసి పదేండ్లు ఆలస్యం చేశారు. అయినా ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కేవలం వికారాబాద్కు కాల్వ తవ్వాల్సిన పని ఉంది. పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాలకు కృష్ణా నది నీళ్లు తీసుకొస్తాం. ఈ నియోజకవర్గాలకు పాలమూరు ఎత్తిపోతలలో వాటా ఉంది. మీకు డెఫినెట్గా ఏడాది కాలంలో నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. వికారాబాద్ భూములు ప్రత్యేక భూములు, ఆ నీళ్లు వచ్చాయంటే మంచి పంటలు పండుతాయి. కమర్షియల్ క్రాప్స్ పండుతాయి. బంగారాన్ని పండిస్తారు. చాలా అద్భుతంగా ఎదుగుతారు. పాలమూరు ఎత్తిపోతల నీళ్లు పంపు కూడా ఇటీవలే ఆన్ చేశాను. అందులో మీ వాటా ఉంది తప్పకుండా నీళ్లు వస్తాయి అని కేసీఆర్ స్పష్టం చేశారు.
కృష్ణా, గోదారి మధ్య ఉండే ఈ ప్రాంతానికి మంచినీళ్లు ఎందుకు ఇవ్వలేదు. మిషన్ భగీరథ రాకముందు మంచి నీళ్ల బాధలు ఎట్ల ఉండే. ఒకసారి యాది చేసుకోండి. ఎన్ని అవస్థలు పడేది ఆడబిడ్డలు. మహిళలంతా ప్లాస్టిక్ బిందెలు తీసుకొని నీళ్లు మోసేది. బోరింగ్లు కొట్టి కొట్టి అలసిపోయేది. మిషన్ భగీరథ పుణ్యమా అని మారుమూల తండాల్లో నీళ్లు పరిశుభ్రంగా వస్తున్నాయి. ఇవన్నీ మీ కండ్ల ముందే ఉన్నాయని కేసీఆర్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఇతర ఆఫీసులు హైదరాబాద్లో ఉండే. మీకు బలమైన కోరిక ఉండే వికారాబాద్ జిల్లా కావాలని. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ కోరిక నెరవేరింది. ఇక్కడ డిగ్రీ, మెడికల్ కాలేజీ లేకుండే. మెతుకు ఆనంద్ పట్టుబట్టి చేయించాడు. ఒక మెడికల్ కాలేజే కాదు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు, కోర్సులు వస్తాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా 450 పడకల ఆస్పత్రి వస్తది. చిన్న చిన్న జబ్బులకు హైదరాబాద్ పోవాల్సిన అసవరమే ఉండదు. ఆ రకంగా మెడికల్ కాలేజీ వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్కు సమీప ప్రాంతం వికారాబాద్. రాబోయే రోజుల్లో వికారాబాద్లో ఐటీ కార్యకలాపాలు విస్తరిస్తాయి. చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాలుష్యం లేని పరిశ్రమలు రాబోతున్నాయి. ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఆనంద్ కోరినట్టు అన్ని చేద్దాం. అనంత పద్మనాభ ఆలయాన్ని డెవలప్ చేద్దాం. అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకుందాం. ఒక ప్రాజెక్టు కూడా రెడీ చేశారు టూరిజం డిపార్ట్మెంట్ వారు అని కేసీఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ చిన్న తప్పు చేస్తే 58 ఏండ్లు గోసపడ్డాం. చాలా బాధలు పడ్డాం. మళ్ల పొరపాటు జరిగతే పదేండ్ల నుంచి మేం చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతది. కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా అందర్నీ కడుపులో పెట్టుకుని పోతున్నాం. అందర్నీ సమానంగా చూస్తూ అన్ని పండుగలను గౌరవిస్తున్నాం. ఉన్నంతలో అందరికి కానుకలు ఇస్తున్నాం. ఇదంతా మీ కండ్ల ముందర జరగుతుంది. ఉత్తమమైన సమాజాన్ని నిర్మించుకున్నాం అని కేసీఆర్ తెలిపారు.