హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధం కారణంగా చదువును మధ్యలోనే వదిలేసి ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల బాధ్యతను తాము తీసుకుంటామని ఆయన వెల్లడించారు. వారందరి చదువుకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, వారు ఇక్కడే మెడిసిన్ చదివే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ద్రవ్యవినిమయ బిల్లుపై సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ.. ‘మన దేశానికి చెందిన దాదాపు 20 వేల మంది విద్యార్థులు యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకున్నరు. మన రాష్ట్రం నుంచి 740 మంది ఉన్నరు. దీంట్లో 700 మంది పిల్లలు ఎంబీబీఎస్ చదివేందుకే పోయిన్రు. అక్కడ 20-25 లక్షలల్ల మెడిసిన్ పూర్తి అయిపోతది. ఇక్కడ కోటి రూపాయలు అయితున్నయి. ఇక్కడ అవకాశం లేకనే పోయిన్రు. కింద మీద పడి 700 మందికి టిక్కెట్లు భరించి వెనక్కి తెచ్చినం. తేనైతే తెచ్చినం వాళ్ల భవిష్యత్ ఏంది? వాళ్ల చదువు డిస్కంటిన్యూ కావాల్నా.. ఆగిపోవాల్నా..? తిరిగి ఉక్రెయిన్ పోయే పరిస్థితులున్నయా? పరిస్థితులు ఎప్పుడు బాగయితయో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంగా నేను ప్రకటిస్తున్నా.. వాళ్ల చదువులకు ఎంత ఖర్చయినా.. భరిస్తం. వాళ్లు డిస్కంటిన్యూ కాకుండా..భవిష్యత్ దెబ్బతినకుండా చూస్తాం. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నం. సీఎస్, ఆరోగ్యశాఖ మంత్రి ఇక్కడే ఉన్నరు. మీరు కేంద్రానికి లేఖ రాయం డి. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించండి.
కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు వాంఛనీయం కాదు
మిమ్మల్ని ఉక్రెయిన్కు ఎవరు పొమ్మన్నరని కేంద్ర మంత్రులు మాట్లాడిన్రు. నవీన్ అనే పిలగాడు చనిపోయిండు. వాళ్ల తల్లిదండ్రులు ఏడుస్తుంటే.. తిన్నదరగక పోయిండ్రని మాట్లాడుతున్నరు. తిన్నదరగక ఉక్రెయిన్ పోతరా? గరీబుగాళ్లు.. దిక్కులేని పిల్లలు చదువుకుంటమని పోయిండ్రు. వాళ్ల గురించి మాట్లాడవల్సిన పద్ధతేనా? దీని మీద మాట్లాడితే దేశ ద్రోహులు అంటరు. ఇటువంటి పెడధోరణులు ఎక్కడికి దారితీస్తయో ప్రజలు అర్థం చేసుకోవాలె. ఇలాంటివి ఏ రకంగానూ వాంఛనీయం కాదు. ఇటువంటివి ఇలాగే కొనసాగిస్తే.. దేశానికి చాల ప్రమాదమొస్తది. ఉన్న ఉపాధి పోతది. అవకాశాలు పోతయి. పెట్టుబడులు రావు. భయంకర పరిస్థితి వస్తది. ఒక పక్క వచ్చేసింది.
ప్రశంసలొస్తున్నయి..
వ్యవసాయంలో మెకనైజేషన్ పెంచడం, రైతులకు పెట్టబడి సాయం (రైతుబంధు)తో ప్రపంచానికే తెలంగాణ బాటచూపించింది. రెండు పంటలకు రూ.10వేలు పెట్టుబడి ఇస్తున్నం. ఫ్రీగా నీళ్లిస్తున్నం. ఇండియాలో ఏ ఒక్క స్టేట్ తెలంగాణ లెక్క ఇస్తలేదు. ఐక్యరాజ్యసమితిలో ప్రశంసించారు. యూఎన్డీపీ చెప్పింది. ఇంత బ్యూటిఫుల్ స్కీం ఎక్కడా లేదని ఫేమస్ ఆగ్రో ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియా అశోక్ గులాటీ ప్రశంసించారు.
చిన్న కాళేశ్వరానికి సీడబ్యూసీ అప్రూవల్
లక్షకోట్లు ఖర్చుబెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్లుపూర్తిచేసి, రైతులకునీళ్లిస్తున్నం. మన మంత్రి హరీశ్రావు కూడవెళ్లివాగుకు, హల్దీవాగుకు నీళ్లు వదలాలని అడుగుతున్నరు. చెక్డ్యాంలు కట్టినం కాబట్టి ఆశపడి పంటలు ఎండిపోవద్దని ప్రజలు అడుగుతున్నరు. మిత్రుడు శ్రీధర్బాబు అడుగుతున్నరు చిన్న కాళేశ్వరం పనులకు కేటాయింపులు లేవని. నేను శ్రీధర్బాబుకు శుభాకాంక్షలు చెప్తున్న. ఈ మధ్యల్నే సీడబ్ల్యూసీ క్లియరెన్స్ వచ్చింది,అప్రూవల్ అయిపోయింది.
ఆత్మలేదు.. నిబ్బరంలేదు
దేశంలో మంచి పరిస్థితులు లేవు. జీడీపీ 8శాతం నుంచి 6శాతానికి పడిపోయింది. 5లక్షల పైచిలుకు పరిశ్రమలు, సంస్థలు మూతపడ్డాయి. నిరుద్యోగిత రేటు యూపీఏ ప్రభుత్వం కంటే చాలా దారుణంగా ఉన్నది. యూపీఏ ఉన్నప్పుడు 4.7 రేటు ఉంటే.. ఇప్పుడది 7.11 శాతానికి పెరిగింది. ఆకలి సూచిలో దేశం ఆగమైంది. ఇవన్నీ కావు. యూఎన్డీపీ, వరల్డ్బ్యాంక్, రిజర్వ్బ్యాంక్ చెప్పినవే. హంగర్ ఇండెక్స్లో మన స్థానం 111. పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ కంటే కింద ఉన్నం. ఆకలి రాజ్యమైతున్నది. ప్రజల హక్కుల పరిరక్షణలో ఇండియా ర్యాంక్ 88 నుంచి 119కి పోయింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 80 నుంచి 131 స్థానానికి పోయింది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో 56 నుంచి 93కు పోయింది. ఇవన్నీ నా ఫిగర్స్ కావు. ప్రపంచస్థాయి సంస్థలు వెలవరించిన అంకెలు. కేంద్రం ఇట్ల సక్కదనముంటే.. భట్టి విక్రమార్క గారు మా మీద పడితే నేనేం జేయాలే? కోటానుకోట్ల మంది పేదరికంలో ఉంటే ఆత్మనిర్భర్ అని చెప్పితే.. ఆత్మలేదు.. నిర్భర్లేదు. ఆత్మనిబ్బరాన్ని దేశం కోల్పోతున్నది. దేశంలో భయంకరంగా పెరుగుతున్నదేందంటే.. మతపిచ్చి. మత పిచ్చిని పెంచుతున్నరు. ఆ మతపిచ్చి.. కార్చిచ్చులా దేశాన్ని దహించివేస్తది. మేం నలుగురం ఎక్కువున్నమని ఓ ఇద్దరుంటే వాళ్లను ఎగబడి కొట్టుడేనా.. ధర్మమైతదా.. పద్ధతా.. దేశాన్ని నడిపే విధానమా? ఈ దేశ యువతకు, దేశ బుద్ధిజీవులు, మేధావులకు అప్పీల్ చేస్తున్నా.. ఇది ఏ రకంగానూ మంచిదికాదు. దశాబ్దాల తరబడి దేశంలో నెలకొల్పబడి ఉన్న వాతావరణం, కొనసాగిన కృషి. కుప్పకూలుతది. యువత ఉద్యోగావకాశాలు పోతయి. చాలా దారుణమైన పరిస్థితి వస్తది.
ఐటీ ఉద్యోగులు వ్యవసాయం చేస్తున్నరు
గతంలో రైతుల నుంచి వాటర్ సెస్సు వసూ లు చేస్తుండె. ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడి కొన్ని వందల కోట్ల బకాయిలను రద్దుచేసినం. తెలంగాణలో నీళ్లకు పన్ను లేదు, రైతులకు విద్యుత్తు చార్జీలు లేవు, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నం. ఛిన్నాభిన్నం అయిపోయిన తెలంగాణ రైతుల బతుకులు స్థిరపడాలి.. దరికి రావలెనని.. స్థిరమైన పాలసీ తీసుకుని ప్రయత్నం చేస్తున్నం. ఇప్పుడొక దరికి వచ్చింది. హైదరాబాద్లో ఉన్న ఐటీ ఉద్యోగులు మళ్లా ఊర్లకు పోయి ఇండ్లు కట్టుకొని ఎవుసం చేస్తున్నరు. అ దెబ్బతోని బ్రహ్మాండంగా భూము ల రేట్లు పెరిగినయి. ఎక్కడపోయినా ఎకరానికి 20 -25 లక్షలలోపు భూములు దొరికే ప్రశ్నేలేదు. రోడ్డుపక్క బిట్టుం టే 50లక్షలు, స్టేట్హైవే పక్కనుంటే 2 కోట్లు, 3 కోట్లు. భూమికావాలని అడిగితే 30 లక్షలు.. 40 లక్షలు పలుకుతున్నది.
మైనస్కు పోతలేం.. కాపాడుకుంటున్నం..
తెలంగాణ రాంగనే ఏడు మండలాలు గుంజుకున్నరు. మన సీలేరును గుంజుకున్నరు. ఉన్న సింగరేణినిని ఖతంబట్టే ప్రయత్నం చేస్తున్నరు. మన పట్ల కేంద్రం తీరు మొత్తం ప్రతికూలమే. సెంట్రల్ గ్రాంట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ 1.60 లక్షల కోట్లు ఉంటే వచ్చింది 75వేల కోట్లే. సెంట్రల్ గ్రాంట్స్ వస్తలేవు. కట్ చేస్తున్నరు. మేకిన్ ఇండియా అంటే అదెక్కడికి పోయిందో. ఇటువంటి పరిస్థితుల్లో.. కరోనా వెంటాడినా తెలంగాణ బెటర్ పెర్ఫార్మెన్స్ చేసింది. నేను గర్వంగా చెబుతున్నా. మనం సంపద పెంచుకుంటున్నం. స్థిరంగా అభివృద్ధిని నమోదు చేస్తున్నాం. ఎక్కడా దిగజారుతలేం. మైనస్కు పోతలేం. కాపాడుకుంటున్నం.