హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీలు, నేతలు కాకుండా ప్రజలు గెలువాలన్నదే తమ అభిమతమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ను గెలిపించి ప్రజలు గెలిచారని పేర్కొన్నారు. తమ గెలుపు ఇందులోనే ఉన్నదని భావించిన ప్రజలు, బీఆర్ఎస్ను రెండోసారి గెలిపించారని తెలిపారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగిందని, ప్రజలంతా బాగుపడ్డారని తెలిపారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
బీఆర్ఎస్ గెలుపంటే సామూహిక గెలుపు. రాజకీయాల్లో ప్రజలు గెలిస్తేనే గెలుపు. వ్యక్తి గెలిస్తేనో, పార్టీ గెలిస్తేనో అది గెలుపు కాదు. తెలంగాణ రాష్ట్రం వస్తది, తెలంగాణ ధనిక రాష్ట్రమైతది. ఇండియాలోనే ఎక్కువ జీతాలు వస్తాయని చెప్పిన. వచ్చింది ఆ అదృష్టం నాకే దక్కింది. ఇండియాలో అతి ఎక్కువ జీతాలు పొందుతూ తెలంగాణ ఉద్యోగులు గెలిచారు. ఒక్క బీఆర్ఎస్ గెలుపులో ఇన్ని గెలుపులు ఉన్నాయి. తెలంగాణ సమాజం గెలుపు ఉన్నది. రేపు కూడా ఇంకా పెంచుతం. కష్టపడుతున్నరు, ఆదాయం పెరుగుతున్నది కాబట్టి ఇంకా పెంచుతాం. ఉద్యోగులు మా బిడ్డలే. పీఆర్సీ టైం వస్తది. వారి కడుపు నింపుతం. అన్నింటికీ మించి చిరు ఉద్యోగులు రెగ్యులర్ స్కేల్ జోన్లో ఉన్నరు. ఈ విధంగా ఒక మానవీయ కోణంలో చేసుకుంటూ పోతా ఉన్నం.
– సీఎం కేసీఆర్
ఎల్వీ ప్రసాద్ ఎండీ, అంతర్జాతీయ కంటి చికిత్సా నిపుణుడు గుల్లపల్లి నాగేశ్వర్రావు, నేను ఒక కార్యక్రమానికి వెళ్లినం. అప్పుడు ఆయన ఓ మాట చెప్పారు. ‘నేను 150 దేశాల్లో కాన్ఫరెన్స్లకు హాజరయ్యాను. కానీ మొత్తం అంధత్వాన్ని నిర్మూలించడం ఎలా అనేదానిపై నాకు ఎక్కడా సమాధానం దొరకలేదు. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ నాకు ఒక మార్గం చూపారు’ అని నన్ను ఉదాహరణగా చూపించారు. రాష్ట్రంలో కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు ఇస్తున్నాం. కంటి సమస్యలు పోయి వెలుగు చూస్తున్న తల్లులు, తండ్రులు అద్భుత గెలుపు సాధించారు