Bhadradri | భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ఈ నెల 30న జరుగనున్నది. ఈ సందర్భంగా కల్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. ప్రత్యేక నిధుల నుంచి సీఎం కేసీఆర్ నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిధులను వెచ్చించారని తెలిపారు. కరోనా సమయంలో భద్రాద్రి ఆలయానికి భక్తుల రాక తగ్గిందని, దాంతో ఆదాయం లేకపోవడంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ తరఫున సీఎం కేసీఆర్ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా.. శ్రీరామ నవమి సందర్భంగా ఇప్పటికే భద్రాచలంలో తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నిత్యం స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ నెల 30 కల్యాణం సీతారాముల కల్యాణం జరునుండగా.. 31న 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం క్రతువు జరగనున్నది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో 1999, 2011లో పుష్కర పట్టాభిషేకం నిర్వహించగా ఈ సారి మార్చి 31న మరోసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కల్యాణాన్ని తిలకించేందుకు ఈ సారి భారీగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రసాదాలతోపాటు తలంబ్రాలను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది.