CM CKR | అకాలంగా కురిసిన వడగండ్లవానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంటనష్టం, పోడు భూములు, గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి పథకం తదితర అంశాలపై మంగళవారం ప్రగతిభవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. వడగండ్ల వానలతో పంటనష్టం జరిగిన నేపథ్యంలో ఇటీవల సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎకరానికి రూ.10వేల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలని సమీక్షా సమావేశంలో సీఎం అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లా కలెక్టర్లు జిల్లా పరిధిలో క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో (KEO) సర్వే చేయించి, జరిగిన పంట నష్టం వివరాలను పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు తక్షణ చర్యలు ప్రారంభించాలని సీఎస్ శాంతికుమారికి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావును ఆదేశించారు. పంట దెబ్బతిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయాలని సీఎం స్పష్టం చేశారు.
ఇప్పటికే ప్రకటించిన విధంగా.. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. ఆ ప్రకారమే గొర్రెల కొనుగోలు పంపిణీ వ్యవహారాలు సాగాలని చెప్పారు. అలాగే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి ప్రకటించిన మేరకు రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు విధివిధానాలను రూపొందించి జారీ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిషారం దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో అర్హులైనవారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందా? అంటూ సీఎస్ను ఆరా తీశారు. 4లక్షల ఎకరాలకు సంబంధించి.. 1.55 లక్షల మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు.. పాస్బుక్కులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టాల పంపిణీ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు.
శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30 న భద్రాచలంలో జరుగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ.కోటి నిధులను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా భద్రాచలం దేవస్థానం ఆదాయం కోల్పోయింది. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు, కల్యాణ వేడుకల నిర్వహణ కోసం రూ.కోటి ప్రత్యేక నిధులను కేటాయించాలని నిర్ణయించారు. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.