హైదరాబాద్ : రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశంలో అడవుల పరిరక్షణ, హరితహారంపై చర్చిస్తున్నారు.
పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించనున్నారు. అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై, హరితహారం ద్వారా విస్తృత ఫలితాల కోసం ప్రణాళికలపై చర్చించనున్నారు. పోడు సమస్యపై అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు మూడు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించి అధ్యయనం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై సీఎంకు ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వనున్నారు.
ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.