CM KCR | రాష్ట్రంలో నడుస్తున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతి సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్ ల అనుమతుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జల సంఘం వారు కోరుతున్న అన్ని వివరాలను , అదనపు సమాచారాన్ని సమర్పించి, త్వరితగతిన అనుమతులు పొందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతలు, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతలు, మోడికుంట వాగు ప్రాజెక్టుల డిపిఆర్ లు సమర్పించి 5 నెలలు గడిచినా, కేంద్ర జల సంఘం నుంచి ఇంకా అనుమతులు రాకపోవడం పట్ల సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
డా. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్ త్వరితగతిన సిద్ధం చేసి, కేంద్ర జలసంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించాలని కేసీఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గోదావరి బోర్డు అధికారులతో కూడా నిరంతరం సంప్రదింపులు జరిపి, 5 గోదావరి ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్ నుంచి తొలగించడానికి ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్ర జల సంఘం కు పంపించాలని అధికారులను సిఎం ఆదేశించారు. సాగునీటి శాఖలో ప్రస్తుత సంవత్సరంలో ముఖ్యమైన ప్రాజెక్టుల టెండర్లు పిలవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నాగార్జునసాగర్ ఎడమ కాలువ పై నిర్మించ తలపెట్టిన లిఫ్టు పథకాలు., గట్టు ఎత్తిపోతల పథకం., కామారెడ్డి & ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాలెన్స్ పనులు., పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పనులు., డా. బి ఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించే బ్యారేజి., చెన్నూర్ ఎత్తిపోతల పథకం., కడెం నదిపై నిర్మించ తలపెట్టిన కుప్టి ప్రాజెక్టులకు టెండర్లు పిలువాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించిన ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణాలు సంపూర్ణమౌతాయన్నారు. సాగునీటిరంగంలో రాష్ట్ర ప్రభుత్వవం నిర్దేశించుకున్న ప్రతిపాదిత లక్ష్యాలను చేరుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రారంభానికి సిద్దమౌతున్న రాష్ట్ర సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనుల పురోగతి పై కూడా సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమైన పనులతో పాటు, లాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, తదితర అనుబంధ భవనాల నిర్మాణ పనుల వేగాన్ని కూడా సమాంతరంగా పెంచాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి సీఎం సూచించారు. సచివాలయానికి పటిష్టమైన భధ్రతా చర్యలు తీసుకుంటున్ననేపథ్యంలో పోలీసు వారికి కావాల్సిన వసతులు తదితర అంశాల గురించి డీజీపీ మహేందర్ రెడ్డి తో సంప్రదించి చర్యలు చేపట్టాలన్నారు. 24 గంటల నిఘా కోసం అధునాతన సాంకేతికతతో పోలీసు కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కూడా సీఎం ఆదేశించారు.